విదేశీ ప్రయాణికులకే క్వారంటైన్
ABN , First Publish Date - 2020-04-08T10:14:59+05:30 IST
విదేశీ ప్రయాణం చేసి వచ్చిన వారికి కరోనా లక్షణాలుంటే, వారిని మాత్రమే ఆస్పత్రిలో క్వారంటైన్ చేస్తామని,
కరోనా లక్షణలుంటేనే ఐసోలేషన్కు... కలెక్టర్ వినయ్చంద్
విశాఖపట్నం, ఏప్రిల్ 7 (ఆంధ్రజ్యోతి): విదేశీ ప్రయాణం చేసి వచ్చిన వారికి కరోనా లక్షణాలుంటే, వారిని మాత్రమే ఆస్పత్రిలో క్వారంటైన్ చేస్తామని, ఇంకెవరికైనా కరోనా పరీక్షలు నిర్వహిస్తే...హోమ్ క్వారంటైన్కే పంపిస్తామని కలెక్టర్ వినయ్చంద్ స్పష్టంచేశారు. విశాఖపట్నంలో క్వారంటైన్ తీరుపై చెలరేగుతున్న విమర్శలకు ఆయన సమాధానమిచ్చారు. రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలిసి మంగళవారం మధ్యాహ్నం ప్రభుత్వ అతిథి గృహంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
గాజువాక కుంచమాంబ కాలనీకి చెందిన మాంసం వ్యాపారి నుంచి కరోనా పరీక్షకు నమూనాలు సేకరించి, ఆయన్ను ఆస్పత్రిలో వుంచకుండా ఇంటికి ఎలా పంపించేశారని, విలేఖరులు ప్రశ్నించగా, ప్రభుత్వ నిబంధనల మేరకు ఆ విధంగా చేశామని చెప్పుకొచ్చారు. మాంసం వ్యాపారి విదేశీ ప్రయాణం చేసి రాలేదని, అతనికి లోకల్ కాంటాక్ట్ ద్వారా వైరస్ వచ్చి వుంటుందనే అనుమానంతో పరీక్షలు నిర్వహించామని, అటువంటి వారిని ఆస్పత్రిలో క్వారంటైన్ చేయకూడదని, నిబంధనలు అంగీకరించవన్నారు. హోమ్ క్వారంటైన్లో వుండాలని చెప్పి పంపించామని, అయితే అతను నిబంధనలు ఉల్లంఘించారని, అది ఆయన చేసిన తప్పు అని పేర్కొన్నారు. అటువంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునే వెసులుబాటు ఉందన్నారు. అంతే తప్ప ఇందులో అధికారుల తప్పిదం ఏమీ లేదన్నారు.