ఒకే లేఅవుట్ వేయండి: టెక్కలి ఆర్డీవో
ABN , First Publish Date - 2020-05-29T10:03:55+05:30 IST
ఒక రెవెన్యూ పరిధిలో ఎన్ని గ్రామాలున్నా ఒకే లేఅవుట్ వేయాలని టెక్కలి ఆర్డీవో ఐ.కిశోర్ తెలిపారు.
చల్లవానిపేట (జలుమూరు): ఒక రెవెన్యూ పరిధిలో ఎన్ని గ్రామాలున్నా ఒకే లేఅవుట్ వేయాలని టెక్కలి ఆర్డీవో ఐ.కిశోర్ తెలిపారు. లింగాలవలస రెవెన్యూ గ్రూపులో వేసిన లేఅవుట్స్ను గురువారం పరిశీలించారు. చల్లవానిపేట, లింగాలవలస గ్రామాలు ఒకే రెవెన్యూ గ్రూపులో ఉండగా గ్రామానికి ఒక లేఅవుట్ వేయడాన్ని తప్పు పట్టారు. రెండు గ్రామాలకు సంబంధించిన లబ్ధిదారులకు ఒకే లే అవుట్ తయారుచేసి లాటరీ పద్ధతిలో ఇళ్ల్ల స్థలాలు కేటాయించాలని ఆదేశించారు.
జోనంకి రెవెన్యూలో గల లబ్ధిదారులకు ప్రభుత్వ పోరంబోగు స్థలం లేదని ఇంతవరకు ఎందుకు చెప్పలేదని తహసీల్దార్ను నిలదీశారు. జోనంకి రెవెన్యూ గ్రూపు లబ్ధిదారులకు లింగాలవలస రెవెన్యూ గ్రూపులోనే లేఅవుట్స్ తయారుచేసి ఇళ్ల స్థలాలు కేటాయించాలని సూచించారు. మండలంలో లేఅవుట్స్ పనులు, లాటరీ విధానంలో లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించే పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ బి.రామారావు, రెవెన్యూ పరిశీలకుడు రావాడ త్యాగరాజు, సర్వేయర్ చిన్నప్పన్న, వీఆర్వో దాలెప్పన్న, లబ్ధిదారులు పాల్గొన్నారు.
లాటరీ విధానంలోనే కేటాయింపు
జలుమూరు, సురవరం, అక్కురాడ, కరకవలస గ్రామాల్లో లే అవుట్ల వద్ద లబ్ధిదారులకు లాటరీ పద్ధతిలో గురువారం ఇళ్ల స్థలాలను కేటాయించారు. ఇళ్ల స్థలాల కేటాయింపులో ఎటువంటి వివక్ష లేకుండా ఉండేందుకు, పేదలకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం లాటరీ విధానంలో ఇళ్లస్థలాలు కేటాయుస్తున్నట్లు రెవెన్యూ పరిశీలకుడు ఎస్.చిన్నారావు తెలిపారు. ఆయా స్థలాల్లో ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు కోన దామోదరరావు, వీఆర్వోలు విజయబాబు, అర్జునరావు తదితరులు పాల్గొన్నారు.