ఢిల్లీని దిగ్బంధిస్తాం

ABN , First Publish Date - 2020-11-30T07:58:29+05:30 IST

కొత్త వ్యవసాయ చట్టాల్ని తీవ్రం గా నిరసిస్తూ కదం తొక్కిన ఉత్తర భారతావని రైతులు వరుసగా నాలుగో రోజూ ఢిల్లీ పొలిమేరల్లోనే బైఠాయించారు. పంజాబ్‌, హరియాణ, యూపీ, ఉత్తరాఖండ్‌, రాజస్థాన్‌ల నుంచి వేలాది మంది రైతులు వణికే చలిని తట్టుకుంటూనే నిరసన కొనసాగించారు...

ఢిల్లీని దిగ్బంధిస్తాం

  • షరతులతో చర్చలకు రైతులు నో
  • నాలుగోరోజూ ఢిల్లీ సరిహద్దుల్లోనే
  • 3న రైతు బృందంతో చర్చలకు అమిత్‌ షా ఓకే

న్యూఢిల్లీ, నవంబరు 29: కొత్త వ్యవసాయ చట్టాల్ని తీవ్రం గా నిరసిస్తూ కదం తొక్కిన ఉత్తర భారతావని రైతులు వరుసగా నాలుగో రోజూ ఢిల్లీ పొలిమేరల్లోనే బైఠాయించారు. పంజాబ్‌, హరియాణ, యూపీ, ఉత్తరాఖండ్‌, రాజస్థాన్‌ల నుంచి వేలాది మంది రైతులు వణికే చలిని తట్టుకుంటూనే నిరసన కొనసాగించారు. 30 సంఘాలు ఒకే ఛత్రఛాయ కిందకొచ్చా యి. ఆందోళనను దీర్ఘకాలం కొనసాగించడానికి సిద్ధపడి కంబ ళ్లు, వంటపాత్రలతో రైతులు రావడం విశేషం. పరిస్థితి ముదరడంతో వారితో చర్చలకు కేంద్రం ముందుకొచ్చింది. డిసెంబరు 3వ తేదీన ఓ రైతు ప్రతినిధి బృందాన్ని చర్చలకు ఆహ్వానించింది. అయితే చర్చలకు ముందు వారు ప్రస్తుతం బైఠాయించిన సింఘూ, టిక్రీ పాయింట్ల నుంచి వైదొలిగి బురారి గ్రౌండ్స్‌కు తరలాలని హోంమంత్రి అమిత్‌ షా షరతు విధించారు. ఇందుకు రైతులు తిరస్కరించారు. బురారి గ్రౌండ్స్‌ ఓ బహిరంగ జైలు లాంటిదని, అక్కడికి మారేది లేదని భీష్మించా రు. బేషరతుగా చర్చలు జరపడానికి తాము సిద్ధమని భారతీయ కిసాన్‌ యూనియన్‌(బీకేయూ) హరియాణా విభాగం అధ్యక్షుడు గుర్నామ్‌ సింగ్‌  ప్రకటించారు. ‘చేసిన చట్టాలపై మాకు నచ్చచెప్పడానికే చర్చలు జరపాలని కేంద్రం భావిస్తే ప్రయోజనం శూన్యం. ఏ షరతులూ ఉండరాదు, మా వైఖరి విని రైతుల కోసం మారడానికి సిద్ధపడితేనే చర్చలు జరపాలి. అప్పుడే మేమూ వాటికి సిద్ధపడతాం’’ అని రైతుసంఘాల సంయుక్త వేదిక ఆలిండియా కిసాన్‌ సంఘర్ష్‌ కోఆర్డినేషన్‌ కమిటీ(ఏఐకేఎ్‌ససీసీ) ప్రతినిధి తేల్చిచెప్పారు. ఆ చట్టాల్ని కేంద్రం ఉపసంహరించుకోవాల్సిందేనని, ఎంఎస్పీ వ్యవస్థను నిరవధికంగా కొనసాగించేట్లు కొత్త బిల్లు తేవాలని కోరారు.


విద్యుత్తు సవరణ చట్టం-2020ని రద్దు చేయాలన్నది మరో డిమాండ్‌. వీటిని ఒప్పుకుంటామని ప్రకటించేవరకూ ఢిల్లీ పొలిమేరల్లోనే ఉంటామని, ఢిల్లీకి దారితీసే అయిదు ప్రవేశ మార్గాల్ని దిగ్బంధనం చేస్తామని ఈ సంఘాల నేతలు  ఆదివారం నాడు  మీడియా సమావేశంలో  స్పష్టం చేశారు. కాగా, రైతుల ఆందోళన  రాజకీయ ప్రేరేపితమని బీజేపీ గానీ, కేంద్రంగానీ భావించడం లేదని, తామెన్నడూ అలా అనలేదని హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. హరియాణ సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ ఈ మాట అనడంతో షా దీనిపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. గతంలో గానీ, ఇపుడు గానీ రైతుల వెనక రాజకీయ హస్తం ఉందన్నది తమ వైఖరి కాదని ఆయన చెప్పుకొచ్చారు. మరోపక్క- కొత్త వ్యవసాయ చట్టాల ను ప్రధాని మోదీ మరోసారి సమర్థించుకున్నారు. ’’ఎన్నో ఏళ్లుగా రైతులు తమ సమస్యలను రైతులు తమ సమస్యలను డిమాండ్ల రూపేణా ఏకరువు పెడుతూనే ఉన్నారు. మేం వాటిని నెరవేర్చాం. ఈ సంస్కరణలు రైతుల బంధనాల్ని తెంచేశాయి’’ అని ఆయన మన్‌కీ బాత్‌లో అన్నారు.

Updated Date - 2020-11-30T07:58:29+05:30 IST