పంజాబ్ శాసన సభ ఎన్నికలు... సోనూ సూద్‌కు ఈసీ ఝలక్...

ABN , First Publish Date - 2022-02-20T19:23:50+05:30 IST

పంజాబ్‌లోని మోగా శాసన సభ నియోజకవర్గంలో పోలింగ్

పంజాబ్ శాసన సభ ఎన్నికలు... సోనూ సూద్‌కు ఈసీ ఝలక్...

చండీగఢ్ : పంజాబ్‌లోని మోగా శాసన సభ నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాలను సందర్శించేందుకు వెళ్తున్న బాలీవుడ్ నటుడు సోనూ సూద్‌కు ఎన్నికల కమిషన్ ఝలక్ ఇచ్చింది. ఆయన ఓటర్లను ప్రభావితం చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో ఆయనను పోలింగ్ కేంద్రాలకు వెళ్ళవద్దని ఆదేశించింది. ఆయన కారును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 


మోగా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్‌పై మావికా సూద్ పోటీ చేస్తున్నారు. ఆమె సోనూ సూద్ సోదరి. ఆయన ఈ నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాలకు వెళ్తూ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని శిరోమణి అకాలీ దళ్ అభ్యర్థి బర్జిందర్ సింగ్ మద్దతుదారు ఒకరు ఫిర్యాదు చేశారు. ఈ ఆరోపణలను సోనూ ఖండించారు. తాను స్థానికుడినని, తాను కేవలం పోలింగ్ కేంద్రాల బయట కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన బూత్‌ల వద్దకు మాత్రమే వెళ్ళానని చెప్పారు. ఇతర అభ్యర్థులు ఓట్ల కొనుగోలుకు ప్రయత్నిస్తున్నారని ఓ ట్వీట్‌లో ఆరోపించారు. ఈ ట్వీట్‌ను మోగా ప్రజా సంబంధాల అధికారికి, పోలీసులకు ట్యాగ్ చేశారు. 


మోగా నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాల సందర్శనకు వెళ్ళకుండా నిరోధించేందుకు సోనూ సూద్ కారును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెప్పారు. ఆయన ఓటర్లను ప్రభావితం చేశారా? అనే అంశంపై నివేదికను సమర్పించాలని మోగా ఎస్ఎస్‌పీని ఆదేశించినట్లు జిల్లా కలెక్టర్ హరీశ్ నయ్యర్ చెప్పారు. ఆయన ఒక పోలింగ్ స్టేషన్ నుంచి మరొక పోలింగ్ స్టేషన్‌కు వెళ్తున్నారని, దీనిపై కొన్ని రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయని తెలిపారు. 


Updated Date - 2022-02-20T19:23:50+05:30 IST