పంజాబ్ శాసన సభ ఎన్నికలు... బూత్ క్యాప్చరింగ్ ఆరోపణలు, ఈవీఎం ఇబ్బందులు...

ABN , First Publish Date - 2022-02-20T17:15:02+05:30 IST

పంజాబ్ శాసన సభ ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం

పంజాబ్ శాసన సభ ఎన్నికలు... బూత్ క్యాప్చరింగ్ ఆరోపణలు, ఈవీఎం ఇబ్బందులు...

చండీగఢ్ : పంజాబ్ శాసన సభ ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. 117 శాసన సభ నియోజకవర్గాల్లో 1,304 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరిలో 93 మంది మహిళలు, ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. 2.14 కోట్ల మంది ఓటర్లు ఓటు వేసేందుకు అర్హులు. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.


ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘవ్ ఛద్దా ఇచ్చిన ట్వీట్‌లో, పంజాబ్‌లో అనేక పోలింగ్ బూత్‌లలో ఈవీఎంలు సక్రమంగా పని చేయడం లేదని ఆరోపించారు. శిరోమణి అకాలీ దళ్ బూత్ క్యాప్చరింగ్‌కు పాల్పడుతోందని ఆరోపించారు. గురు హర్ సహాయ్ ఏసీ, బూత్ నెం.23లో శిరోమణి అకాలీ దళ్ కార్యకర్తలు బూత్ క్యాప్చరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు. ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యుల తరపున తాము ఓటు వేస్తామని, తమకు అవకాశం ఇవ్వాలని, లేదంటే ఎవరినీ ఓటు వేయనివ్వబోమని పోలింగ్ అధికారులను హెచ్చరించారని ఆరోపించారు. ఎన్నికల సంఘం దీనిపై చర్య తీసుకోవాలని కోరారు. 


అట్టారీ ఏసీ, బూత్ నెం.197, ఫగ్వారా ఏసీ,బూత్ నెం.119, సనోర్ ఏసీ, బూత్ నెం.209, షుట్రానా ఏసీ, బూత్ నెం.20, 16; నిహాల్ సింగ్ వాలా ఏసీ, బూత్ నెం.13లలో ఈవీఎంలు పని చేయడం లేదన్నారు. 


పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ మాట్లాడుతూ, పంజాబ్‌లో రెండు తరాలు తీవ్రంగా నష్టపోయాయని చెప్పారు. ఉగ్రవాదానికి ఓ తరం బలైపోయిందని, మరొక తరం మాదక ద్రవ్యాలకు బలైపోయిందని ఆరోపించారు. కెప్టెన్ అమరీందర్ సింగ్,  బాదల్ కుటుంబం మాఫియా వ్యవస్థ ఓవైపు ఉన్నాయని, మరొక వైపు పంజాబ్‌ను ప్రేమించేవారు ఉన్నారని చెప్పారు. చాలా జాగ్రత్తగా ఓటు వేయాలని ప్రజలను కోరారు. మార్పు తేవడం కోసం పెద్ద ఎత్తున ఓట్లు వేయాలన్నారు. 


కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ మాట్లాడుతూ, పంజాబ్‌ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఓటు వేయాలని ప్రజలను కోరారు. కులం, మతం వంటివాటికి అతీతంగా ఓటు వేయాలన్నారు. ఆయన లూధియానాలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 


Updated Date - 2022-02-20T17:15:02+05:30 IST