పునరావాస చర్యలు చేపట్టండి
ABN , First Publish Date - 2021-10-29T05:42:58+05:30 IST
వ్యవసాయ పనులు లేక రోడ్డున పడ్డామని, వెంటనే పునరావాస చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేశారు.
గోరంట్ల, అక్టోబరు 28: వ్యవసాయ పనులు లేక రోడ్డున పడ్డామని, వెంటనే పునరావాస చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేశారు. మండలంలోని పాలసముద్రం వద్ద బెల్, నాసెన పరిశ్రమల కోసం భూములు ఇచ్చిన రైతులు తమ హక్కులకోసం గురువారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. 2013 భూసేకరణ చట్టం మేరకు హక్కులు కల్పించడంతోపాటు పునరావాసం కల్పించాలని సీపీఎం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన జరిపారు. ఉద్యోగాలు కల్పిస్తామంటూ తక్కువ నష్టపరిహారం చెల్లించి భూములను సేకరించారన్నారు. వ్యవసాయ పనులు లేక వలసబాటపట్టి కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. చట ప్రకారం హక్కులు కల్పించడంతోపాటు పునరావాస చర్యలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ రామాంజినేయరెడ్డికి వినతిపత్రం అందించారు. ఆందోళనలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పెద్దన్న, చేనేత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు రాజగోపాల్, పలువురు రైతులు పాల్గొన్నారు.