Chief Minister: పుదువైకి ‘ఉచిత’ వరాలు
ABN , First Publish Date - 2022-08-23T13:27:23+05:30 IST
కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిపై ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి ఉచితాల వరాల జల్లు కురిపించారు. పన్ను పోటు లేకుండానే రూ.10,696.61
- గృహిణులకు ప్రతినెలా రూ.1000
- స్వాతంత్య్ర సమరయోధులకు ఇళ్లపట్టాలు
- ప్లస్-1, 2 విద్యార్థులకు ల్యాప్టాప్లు
- 9 తరగతి విద్యార్థులకు సైకిళ్లు
- త్వరలో న్యాయవిశ్వవిద్యాలయం
- ఈసారీ పన్నురహిత బడ్జెట్టే
- అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి
పుదుచ్చేరి, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిపై ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామి ఉచితాల వరాల జల్లు కురిపించారు. పన్ను పోటు లేకుండానే రూ.10,696.61 కోట్ల అంచనా వ్యయంతో వార్షిక బడ్జెట్ దాఖలు చేశారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా నిర్వర్తిస్తున్న ఎన్.రంగస్వామి(N. Rangaswamy) సోమవారం ఉదయం 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను పుదుచ్చేరి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. రాష్ట్రంలోని 260 మంది స్వాతంత్య్ర సమరయోఽధులకు ఉచిత ఇంటి పట్టాలు, ప్లస్-1, ప్లస్-2 విద్యార్థులకు దశలవారీగా ఉచిత లాప్టాప్(Laptop)లు, ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాల్లో చదివే తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఉచిత సైకిళ్లను అందజేయనున్నట్లు ప్రకటించారు. ఈ బడ్జెట్లో రూ.6,557.23 కోటు రెవెన్యూ రాబడిగాను, కేంద్ర సాయం రూ.1729.77 కోట్లుగా చూపించారు. ఇదేవిధంగా కేంద్రప్రభుత్వం(Central Govt) రూ.1889.61 కోట్ల మేర రుణాలు పొందటానికి కూడా అనుమతించిందని ఆయన వివరించారు. రాష్ట్ర రుణభారం రూ. 9,859.20 కోట్లుగా ఉందని ఆయన వెల్లడించారు..
పోలీసుశాఖలో పోస్టుల భర్తీ...
పోలీసుశాఖలో 1044 పోస్టులను వీలయినంత త్వరగా భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి రంగస్వామి(Chief Minister Rangaswamy) తెలిపారు. అదేవిధంగా 21 యేళ్ల నుంచి 55 యేళ్లలోపు నిరుపేద గృహిణులకు ప్రతి నెలా రూ.1000 ఇవ్వనున్నట్లు ప్రకటించారు. పదేళ్లకుపైగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని తెలిపారు. కారైక్కాల్ నుంచి శ్రీలంకలోని కాంగేశన్ ఓడరేవు వరకు ఈ యేడాది సరకుల నౌకాయానాన్ని ప్రారంభించనున్నామన్నారు.
లా వర్సిటీ...
పుదుచ్చేరిలో న్యాయవిశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నామని, దీని కోసం స్థల ఎంపిక కూడా జరిగిందని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ విశ్వవిద్యాలయానికి ప్రధాని మోదీ త్వరలో శంకుస్థాపన చేయనున్నారని కూడా తెలిపారు. శాసనసభ్యులకు నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.2 కోట్ల చొప్పున కేటాయించనున్నామన్నారు. ఇదిలా వుండగా ముఖ్యమంత్రి రంగస్వామి(Chief Minister Rangaswamy) బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఆర్. సెల్వం ప్రకటించారు.