కేంద్రం వద్ద ప్రజా ప్రయోజనాల తాకట్టు
ABN , First Publish Date - 2021-07-28T06:18:45+05:30 IST
ప్రజల ప్రయోజనాలను కేంద్రం వద్ద జగన్ ప్రభుత్వం తాకట్టు పెడుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు డి.రమాదేవి విమర్శించారు.
జగన్పై సీపీఎం నేత రమాదేవి విమర్శ
తిరుపతి(ఆటోనగర్), జూలై 27: ప్రజల ప్రయోజనాలను కేంద్రం వద్ద జగన్ ప్రభుత్వం తాకట్టు పెడుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు డి.రమాదేవి విమర్శించారు. తిరుపతి యశోదనగర్లోని సీపీఎం కార్యాలయంలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. విద్యుత్ బిల్లుకు సంబంధించిన ముసాయిదా చట్టం ప్రస్తుతం పార్లమెంటులో ఉందన్నారు. ఇది అమల్లోకి వస్తే.. రాష్ట్రాల హక్కులు హరించుకుపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు విద్యుత్ రాయితీలు ఉండవన్నారు. అందుకే ఈ చట్టాన్ని కేరళ, కర్ణాటక, తమిళనాడు వ్యతిరేకించాయన్నారు. ఇలాంటి బిల్లులను ప్రభుత్వం గుడ్డిగా అమలు చేయడానికి సహకరిస్తే రాష్ట్రంలో ఉన్న డిస్కంలు ప్రైవేట్పరం అవుతాయని హెచ్చరించారు. గతంలో చంద్రబాబు హయాంలో విద్యుత్ సంస్కరణలను అమలు చేస్తే ప్రజలు వ్యతిరేకించిన విషయం తెలిసిందేనన్నారు. ఇటీవల కృష్ణాజలాల విషయాన్ని రెండు తెలుగు రాష్ర్టాల సీఎంలు పంతాలకు పోయి రాద్ధాంతం చేస్తున్నారన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం చోద్యం చూడటం సరికాదని పేర్కొన్నారు. టీటీడీలో ఖాళీగా ఉన్న ఎనిమిది వేల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఫారెస్టు కార్మికులకు టైం స్కేలు ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో నాయకులు కందారపు మురళి, నాగరాజు, యాదగిరి, జనార్దన్ పాల్గొన్నారు.