పబ్జీ.. మళ్లీ వచ్చెన్!
ABN , First Publish Date - 2021-05-07T07:29:29+05:30 IST
ఆన్లైన్ మొబైల్ బ్యాటిల్ గేమ్ పబ్జీ భారత్లోకి మళ్లీ రానుంది. ‘పబ్జీ మొబైల్ ఇండియా’ పేరుతో ఇంతకు ముందు భారతీయులకు సుపరిచితమైన ఈ గేమ్ను...
- కొత్త పేరుతో త్వరలో భారత్లోకి
న్యూఢిల్లీ, మే 6: ఆన్లైన్ మొబైల్ బ్యాటిల్ గేమ్ పబ్జీ భారత్లోకి మళ్లీ రానుంది. ‘పబ్జీ మొబైల్ ఇండియా’ పేరుతో ఇంతకు ముందు భారతీయులకు సుపరిచితమైన ఈ గేమ్ను.. ‘బ్యాటిల్ గ్రౌండ్ మొబైల్ ఇండియా’ పేరుతో త్వరలో అందుబాటులోకి రానుంది. దక్షిణ కొరియాకు చెందిన ఆ గేమింగ్ యాప్ మాతృసంస్థ క్రాఫ్టాన్ గురువారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. తొలుత ప్రీ-రిజిస్ట్రేషన్లను ప్రారంభిస్తామని, ఆ తర్వాత గేమ్ను భారత్లో లాంచ్ చేస్తామని ప్రకటించింది. వినియోగదారుల డేటాకు పూర్తిస్థాయిలో భద్రత ఉండేలా ఫీచర్లను అభివృద్ధి చేశామని, భారత్కు చిహ్నంగా మూడు రంగులతో ఈ గేమ్ను తీసుకువస్తున్నామని వివరించింది. కాగా.. భారత సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా ఉన్న 118 చైనా యాప్లను గత ఏడాది సెప్టెంబరు 2న భారత్ నిషేధించింది. దక్షిణ కొరియాకు చెందిన యాప్ అయినా.. చైనా కంపెనీలకు భాగస్వామ్యం ఉండడంతో.. పబ్జీపైనా నిషేధం వేటు పడింది.