అడవి బిడ్డలకు సకాలంలో వైద్యం అందించాలి: Vijaya Shanti
ABN , First Publish Date - 2022-06-26T16:57:27+05:30 IST
Hyderabad: సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై బీజీపీ నాయకురాలు విజయశాంతి విమర్శలు గుప్పించారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో మలేరియా, వైరల్ ఫీవర్ బారిన పడే
Hyderabad: సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై బీజీపీ నాయకురాలు విజయశాంతి విమర్శలు గుప్పించారు. వర్షాకాలం ప్రారంభం కావడంతో మలేరియా, వైరల్ ఫీవర్ బారిన పడే అవకాశం ఉందని, అయితే గిరిజనులకు వైద్యం సకాలంలో వైద్యం అందేలా చూడాలని సూచించారు. ఇంకా తన ఫేస్బుక్లో ఇలా పోస్టు చేశారు.
ఆడవి బిడ్డల ప్రాణాలతో ఆటలాడితే పుట్టగతులుండవ్
‘‘తెలంగాణలో గిరిజన బిడ్డలు నానా అవస్థలు పడుతున్నారు. వానాకాలం మొదలవ్వడంతో అడవి బిడ్డలు జ్వరాలతో మంచం పట్టారు. మలేరియా, వైరల్ ఫీవర్ల బారిన పడుతున్నారు. వీరికి వైద్యం అంతంతమాత్రంగానే అందుతోంది. అటవీ ప్రాంతాల నుంచి దవాఖానాలకు వెళ్దామంటే రోడ్డు సౌకర్యం లేక మధ్యలోనే ప్రాణాలు కోల్పోతున్నారు. వాగులు, వంకలు అడ్డం వస్తుండడంతో తోటి గిరిజనులే కావడి కట్టి తీసుకుపోవడం, మంచాలపై వేసుకుని దాటించడం చేస్తున్నారు. రోడ్డు సౌకర్యం ఉన్నచోట్ల అంబులెన్స్లు సమయానికి రాక మార్గంమధ్యలోనే చనిపోతున్నారు. ఒకవేళ అదృష్టం బాగుండి.. హాస్పిటల్ వరకూ వెళ్లినా సిబ్బంది, డాక్టర్ల కొరత, సౌకర్యాలు లేకపోవడం లాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. పాములు, తేళ్లు కుట్టి దవాఖానాల బాట పడితే అక్కడ విరుగుడు మందుల్లేక కాటికి పోతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గిరిజన గ్రామాల్లో ఎక్కడ చూసినా జ్వరాలతో బాధపడుతున్న వారే కనిపిస్తున్నారు. ఎక్కువ మంది వైరల్ ఫీవర్, మలేరియా బారిన పడేవారే ఉంటున్నారు. జిల్లాలో 29 పీహెచ్సీలు,15 రౌండ్ ది క్లాక్ పీహెచ్సీలు, 240 సబ్సెంటర్లున్నా అన్ని చోట్లా సిబ్బంది కొరత వేధిస్తోంది. ప్రతి సబ్సెంటర్కు రోజూ 10 నుంచి 15 మంది జ్వరాలతో క్యూ కడుతున్నారు.
దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగరంలోని 24 గంటల దవాఖానాలో ఇద్దరు డాక్టర్లకు ఒక్కరే ఉన్నారు. ఈయన కూడా మీటింగులనీ... ఇతర పనులనీ అందుబాటులో ఉండడు. ఈ ఒక్క జిల్లానే కాదు. జయశంకర్ భూపాలపల్లి, కుమ్రం భీం ఆసిఫాబాద్, జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల గిరిజనుల పరిస్థితి కూడా ఇలానే ఉంది. వారికి సాధారణ జ్వరం వచ్చినా ఒక్క మందు బిళ్ల కూడా అందుబాటులో ఉండడం లేదు. జ్వరానికి కూడా మందులు ఇవ్వలేని సర్కార్ ఉంటే ఎంత? లేకుంటే ఎంత? దీనికి నీ జవాబేంటి కేసీఆర్? బంగారు తెలంగాణ అంటే ఇదేనా? ఇప్పటికైనా గిరిజన బిడ్డలకు సరియైన వైద్యం అందించు. అమాయక ఆడవి బిడ్డల ప్రాణాలతో ఆటలాడుతున్న కేసీఆర్ సర్కార్ పుట్టగతులు లేకుండా పోవడం ఖాయం.’’ అని విజయశాంతి పేర్కొన్నారు.