ఆర్టీసీ చార్జీల పెంపుపై నిరసనల వెల్లువ
ABN , First Publish Date - 2022-07-03T06:12:43+05:30 IST
ఆర్టీసీ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా జిల్లావ్యాప్తంగా శనివారం నిరసనలు వెల్లువెత్తాయి. తెలుగుదేశం, వామపక్ష పార్టీల శ్రేణులు పలుచోట్ల నిరసన ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించాయి.
పలుచోట్ల రోడ్డెక్కిన టీడీపీ, వామపక్షాలు
ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు
జగన్ ప్రభుత్వ వైఖరిపై నేతల మండిపాటు
తక్షణమే చార్జీలను తగ్గించాలని డిమాండ్
ఒంగోలు, జూలై 2 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా జిల్లావ్యాప్తంగా శనివారం నిరసనలు వెల్లువెత్తాయి. తెలుగుదేశం, వామపక్ష పార్టీల శ్రేణులు పలుచోట్ల నిరసన ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించాయి. రాష్ట్రంలో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక ప్రజలపై బాదుడేబాదుడుగా పరిస్థితి తయారైందని, అన్ని రకాల భారాలు మోపుతున్నారని ఆందోళనల్లో పాల్గొన్న నేతలు మండిపడ్డారు. పేద, సామాన్య ప్రజానీకం ప్రయాణించే ఆర్టీసీ బస్సుల్లో చార్జీలను పెంచడం దుర్మార్గమన్నారు. పెంచిన చార్జీలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఒంగోలులోని ప్రకాశం బస్స్టేషన్ ఎదుట టీడీపీ ఒంగోలు నగర కమిటీ అధ్యక్షుడు కొఠారి నాగేశ్వరరావు, పార్లమెంట్ ఉపాధ్యక్షుడు కామేపల్లి శ్రీనివాసరావు నేతృత్వంలో చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ ధర్నా నిర్వహించారు. డిపో సమీపంలోని సాగర్ హోటల్ సెంటర్లో వామపక్షాల కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేపట్టారు. వామపక్షాల జిల్లా నాయకులు సయ్యద్ హనీఫ్, యు.ప్రకాశరావు, ఎంఎస్ సాయి, కొండారెడ్డిపాల్గొన్నారు. మార్కాపురంలో మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి నేతృత్వంలో పట్టణంలో టీడీపీశ్రేణులు నిరసన ర్యాలీ నిర్వహించి, చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. టీడీపీ ఒంగోలు పార్లమెంట్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ రసూల్ ఇతర నేతల ఆధ్వర్యంలో పొదిలిలో రాస్తారోకో నిర్వహించారు. చీమకుర్తిలో జరిగిన ర్యాలీలో పట్టణ టీడీపీ అధ్యక్షుడు గొల్లపూడి సుబ్బారావు, రైతు కమిటీ అధ్యక్షుడు కొండ్రగుంట వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. అలాగే గిద్దలూరు అర్ధవీడు, కంభం, వెలిగండ్ల, సీఎస్పురం, పీసీపల్లి తదితర ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించగా కొండపిలో వామపక్షాల కార్యకర్తలు నిరసన ప్రదర్శన చేపట్టారు.