ఉక్కు సెగ.. పెట్రో మంట
ABN , First Publish Date - 2021-02-27T05:15:56+05:30 IST
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ, గ్యాస్ పెట్రోల్ డీజీల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ వేదిక, వామపక్షాల ఆధ్వర్యంలో శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు.
ప్రైవేటీకరణ, ధరల పెంపుపై నిరసన వెల్లువ
వామపక్షాలు, ప్రజా సంఘాల రాస్తారోకో
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయం, పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరల పెంపుపై వామపక్షాలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, వాహన యజమానులు, డ్రైవర్లు భగ్గుమన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ధర్నా, రాస్తారోకో చేపట్టారు. మోదీ అధికార బలంతో ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని, సామాన్యుల నడ్డి విరిచి, కార్పొరేట్ శక్తుల కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తీరని ద్రోహం చేస్తుందన్నారు. ప్రజలకు ఉపాధి కల్పించకపోగా ఉన్న ఉపాధి కూడా ఎండగట్టే చర్యలు తీసుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా దెబ్బతీసిన కేంద్ర ప్రభుత్వం ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయంతో మరింత పాతాళానికి నెట్టివేస్తుందన్నారు. గ్యాస్ సబ్సిడీ నిలిపివేసి ధర విపరీతంగా పెంచడంతో సామాన్యుల గతేం కావాలని ప్రశ్నించారు. పెట్రో, డీజిల్ ధరల పెంపు మోయలేని భారం కావడంతో పాటు నిత్యావసరాలు, రవాణా చార్జీలు విపరీతంగా పెరిగిపోయాయని అన్ని వర్గాల వారు ఆందోళన వ్యక్తం చేశారు.
భీమవరం అర్బన్, ఫిబ్రవరి 26: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ, గ్యాస్ పెట్రోల్ డీజీల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ వేదిక, వామపక్షాల ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలో రాస్తారోకో నిర్వహించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కును కాపాడుకుందాం, గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని, మోదీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించాలని నినాదాలు చేశారు. సీపీఎం డెల్టా జిల్లా అధ్యక్షుడు బి.బలరాం, ఏఐటీయూసీ నేత చెల్లబోయిన రంగారావు, ఫార్వర్డ్బ్లాక్ నాయకుడు లంకా కృష్ణమూర్తి తదితరులు కేంద్ర ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. జెఎన్వీ గోపాలన్, ఎం.వైకుంఠరావు, మల్లు సీతారాం ప్రసాదు, క్రాంతిబాబు, ఎం.రామాంజనేయులు, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు.
భీమవరం రూరల్: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని, పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సీపీఎం మండల కన్వీనర్ ఇంజేటి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. వెంప బస్టాండ్ సెంటర్లో నిరసన తెలిపారు. కోడి సత్యనారాయణ, తోటే సుధాకర్, కాటికి గోపి, బల్ల సుబ్బారావు, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
పెనుగొండ : వామపక్షాలు, సీఐటీయూ పిలుపు మేరకు పెనుగొండ సిద్ధాంతం రోడుపై రాస్తారోకో నిర్వహించారు. సీపీఎం చెరుకువాడ గ్రామ కార్యదర్శి మాదాసు నాగేశ్వరరావు, పెనుగొండ గ్రామ కార్యదర్శి గుర్రాల సత్యనారాయణ, సీఐటీయూ జిల్లా డెల్టా ఉపాధ్యక్షుడు ఎస్.వెంకటేశ్వరరావు మా ట్లాడారు. పులిదిండి రామారావు, శీలం ఏసు, మల్లుల లక్ష్మీనారాయణ, మేకా నారాయణరావు, నక్కా మదన్మోహన్, మహిళలు పాల్గొన్నారు.
యలమంచిలి: చించినాడలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహిం చారు. సీపీఎం నాయకులు బాతిరెడ్డి జార్జి, దేవ సుధాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను పెంచి సామాన్య, మధ్య తర గతి ప్రజలపై పెనుభారం మోపిందన్నారు. కానేటి బాలరాజు, జిల్లెళ్ల ప్రశాంతి, మాసవరపు సుబ్బారావు, బి.సుగుణ పాల్గొన్నారు.
పాలకొల్లు అర్బన్ : ఎక్సైజ్ సుంకాలను తగ్గించి పెట్రోలు, డీజిల్ ధర లు తగ్గించాలని మాజీ ఎమ్మెల్యే దిగుపాటి రాజగోపాల్ ప్రభుత్వాన్ని డిమాం డ్ చేశారు. సీపీఎం నాయకులు, లారీ ఓనర్స్ అసోసియేషన్, ఇసుక టిప్పర్లు అసోసిసయేషన్, టాక్సీ ఓనర్సు అసోసియేషన్లతో కలిసి రాస్తారోకో, ధర్నా కార్యక్రమాలను చేపట్టారు. లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వలిరెడ్డి రామారావు, ఇసుక టిప్పర్ల సంఘం నాయకులు రావూరి రాజా, సీపీఎం నేత లు జవ్వాది శ్రీనివాసరావు, వలవల శ్రీరామమూర్తి మాట్లాడారు. లారీ, టాక్సీ డ్రైవర్లు, ఓనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అఖిల భారత కార్మిక సంఘాలు చేస్తున్న ఆందోళనకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య మద్దతు ప్రకటించింది. సీటీవో కార్యాలయం వద్ద పలువురు ఉద్యోగులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎన్జీవో సంఘం అధ్యక్షుడు గుడాల హరిబాబు, కార్యదర్శి వేగేశ్న మురళీ కృష్ణంరాజు, నాయకులు పాల్గొన్నారు.
వీరవాసరం: పెట్రో ధరలు తగ్గించాలని డిమాండ్చేస్తూ నందమూరుగరువు పెట్రోల్ బంకు వద్ద, నవుడూరు జంక్షన్లో సీపీఎం, రైతు సంఘం నాయకులు ఆందోళన చేపట్టారు. ధరల భారాన్ని ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. జుత్తిగ నర్సింహమూర్తి, పోతుల మృత్యుంజయ, రెడ్డి రామారావు, యాళ్ళబండి నారాయణమూర్తి, కేతా జ్యోతిబసు, పాలా అజయ్గోష్, నేతల ఆనందరావు, గొట్టుముక్కల శ్యాంబాబు, తదితరులు పాల్గొన్నారు.