పాఠశాలల విభజన విరమించుకోవాలి
ABN , First Publish Date - 2021-07-30T06:26:28+05:30 IST
ప్రాథమిక పాఠశాలల విభజన ప్రక్రియను ప్రభుత్వం విరమించుకోకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు, ఫ్యాప్టో చైర్మన్ బసవలింగారావు తెలిపారు.
గుంటూరు(విద్య), జూలై 29: ప్రాథమిక పాఠశాలల విభజన ప్రక్రియను ప్రభుత్వం విరమించుకోకుంటే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు, ఫ్యాప్టో చైర్మన్ బసవలింగారావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్త ఆందోళనల్లో భాగంగా స్థానిక తహసీల్దారు కార్యాలయం వద్ద వారు గురువారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యారంగ నిపుణుల అభిప్రాయాలు పట్టించుకోకుండా ప్రభుత్వం ఏకపక్షంగా పాఠశాలల విభజన చేస్తుందన్నారు. దీనివల్ల విద్యార్థులు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. విద్యా రంగంలో నెలకొని ఉన్న ఎన్నో సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వం పాఠశాలల విభజనపై దృష్టిపెట్టడం శోచనీయమన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు రమేష్, జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు ప్రభుదాస్, రాష్ట్ర కౌన్సిలర్ మహ్మద్ ఖాలీద్, సత్యం, ఎస్ రాంబాబు, జయపాల్, గంగినేని రామారావు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.