వంట గ్యాస్ ధరలు తగ్గించాలని నిరసన
ABN , First Publish Date - 2021-07-26T06:00:38+05:30 IST
వంట గ్యాస్ ధరలు తగ్గించాలని నిరసన
రామలింగేశ్వరనగర్, జూలై 25: పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని యువజన చైతన్య వేదిక సభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళా సాధికారత అంటే పాతతరం మహిళల్లాగా నేటి తరం మహిళలు కట్టెపొయ్యిలు మీద వంట చేయడమేనా అని సంస్థ సభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వంట గ్యాస్ ధరలను పెంచడాన్ని వ్యతిరేకిస్తూ ఆదివారం యువజన చైతన్య వేదిక ఆధ్వర్యంలో పటమటలో వంట గ్యాస్ సిలిండర్ను సంస్థ సభ్యులు మెడలో వేసుకుని డోలులా వాయిస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. పేద ప్రజల కోసం నిరంతరం సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నామని ప్రగల్భాలు పలికే కేంద్ర ప్రభుత్వం కరోనా విపత్కర పరిస్థితుల్లో వంట గ్యాస్ ధరలను పెంచడం సరికాదని సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు బెజవాడ నజీర్ అన్నారు. మహిళలు కంటనీరు పెట్టడం కేంద్ర ప్రభుత్వానికి శ్రేయస్కరం కాదని ఆయన హితవు పలికారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా కార్యదర్శి జయలక్ష్మి, సంస్థ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కలికిరి తిరుమలేష్, చనపతి మల్లికార్జున్, నారాయణమ్మ, అప్పల నాయుడు పాల్గొన్నారు.