సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యం
ABN , First Publish Date - 2022-06-29T06:05:21+05:30 IST
రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యం ఇవ్వడంతో అభివృద్ధి పనుల్లో జాప్యం చోటుచేసుకుందని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు.
వైసీపీ ప్లీనరీలో మాజీ మంత్రి వెలంపల్లి
లక్ష్మీపురం(తిరువూరు), జూన్ 28: రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యం ఇవ్వడంతో అభివృద్ధి పనుల్లో జాప్యం చోటుచేసుకుందని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. నియోజకవర్గం వైసీపీ ప్లీనరీ సమావేశం మంగళవారం లక్ష్మీపురం మనోగార్డెన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో 90 శాతం నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రికి దక్కుతుందన్నారు. ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి మాట్లాడుతూ మూడు సంవత్సరాల్లో తిరువూరు నియోజకవర్గంలో రూ.1,151 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు జరిగాయన్నారు. రైతులకు నాణ్యమైన విద్యుత్ను అందించేందుకు సుమారు రూ.3 కోట్లతో విస్సన్నపేటలో రెండు, తిరువూరు మండలం గానుగపాడులో ఒక విద్యుత్ సబ్స్టేషన్తోపాటు రూ.85 లక్షలతో ఎ,కొండూరులో నూతన సబ్స్టేషన్లు నిర్మించామన్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, కరోనా కష్టాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నామని, అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు త్వరలో వస్తాయన్నారు. తొలుత వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళి అర్పించారు. సభలో కృష్ణాజిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక, మర్రి రాజశేఖర్, శివరామకృష్ణ, ఏఎంసీ చైర్మన్ శీలం నాగనర్సిరెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు యరమల రామచంద్రారెడ్డి, తదితరులు ప్రసంగించారు. మున్సిపల్ చైర్పర్సన్ గత్తం కస్తూరిబాయి, వైస్ చైర్పర్సన్లు వెలుగొటి విజయలక్ష్మి, గుమ్మ వెంకటేశ్వరి, పార్టీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.