దేశం మొత్తం వైద్య సిబ్బందికి రుణపడి ఉంది : మోదీ

ABN , First Publish Date - 2021-05-18T02:34:58+05:30 IST

దేశంలోని వైద్యులతో పాటు ఇతర వైద్య సిబ్బంది, పారా మెడికల్ సిబ్బందికి ప్రధాని నరేంద్ర మోదీ ధన్యవాదాలు

దేశం మొత్తం వైద్య సిబ్బందికి రుణపడి ఉంది : మోదీ

న్యూఢిల్లీ : దేశంలోని వైద్యులతో పాటు ఇతర వైద్య సిబ్బంది, పారా మెడికల్ సిబ్బందికి ప్రధాని నరేంద్ర మోదీ ధన్యవాదాలు ప్రకటించారు. కరోనా లాంటి క్లిష్ట సమయంలోనూ వారు నిరుపమాన సేవలు చేస్తున్నారని, దేశం మొత్తం వారికి రుణపడి ఉందని ప్రధాని మోదీ ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం దేశంలోని వైద్యులు, ఫీల్డ్ ఆఫీసర్లతో పాటు ఇతర వైద్య సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనాను నియంత్రించడంలో వారు ఎదుర్కొన్న ఇబ్బందులు, ఎదురైన అనుభవాలను మోదీ అడిగి తెలుసుకున్నారని ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. కరోనా పరిస్థితులతో పాటు ‘ముకోర్మైకోసిస్’ వ్యాధి గురించి కూడా చర్చించారు. ఈ వ్యాధి గురించి తెలుసుకోవడానికి వైద్యులు లోతైన పరిశోధన చేయాలని, ప్రజలకు లోతైన అవగాహన కల్పించాలని మోదీ సూచించారు.


ప్రస్తుత పరిస్థితుల్లో శారీరక సంరక్షణతో పాటు మానసికంగా కూడా సంరక్షణ ప్రాముఖ్యతను సూచించాలని పిలుపునిచ్చారు. పరీక్షలు, మందుల సరఫరా, మౌలిక సదుపాయాల విషయాల్లో చర్యలను వేగవంతం చేయాలని, ఆక్సిజన్‌తో పాటు కరోనా ఇబ్బందులను కూడా అధిగమించాలని వైద్యులకు మోదీ సూచించారు. సెకండ్ వేవ్‌లో ఫ్రంట్ లైన్ యోధులతో టీకా కార్యక్రమాన్ని ప్రారంభించిన వ్యూహం సత్ఫలితాలిచ్చే సూచనలు కనిపిస్తున్నాయని, 90 శాతం మంది ఆరోగ్య రంగంలో ఉన్న వారు ఇప్పటికే మొదటి డోసును తీసుకున్నారని పేర్కొన్నారు. 

Updated Date - 2021-05-18T02:34:58+05:30 IST