‘ఉపాధి’లో అక్రమాలకు అడ్డుకట్ట
ABN , First Publish Date - 2022-05-23T05:16:08+05:30 IST
ఉపాధి హామీ పథకంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా
- కొత్తగా అమల్లోకి ఎన్ఎంఎంఎ్స యాప్
- ప్రతిరోజూ రెండుసార్లు ఆన్లైన్లో వివరాల నమోదు
- క్షేత్రస్థాయి నుంచే వివరాలు అప్లోడ్
- దశలవారీగా అన్ని గ్రామాల్లో అమలు
- ఆరంభంలో కొంత ఇబ్బందులు
- కొద్దిరోజుల్లో గాడిన పడే అవకాశం
ఉపాధి హామీ పథకంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. పనుల్లో అవినీతిని కట్టడిచేసేందుకు కొత్త యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. నేషనల్ మొబైల్మానిటరింగ్ సిస్టమ్ (ఎన్ఎంఎంఎ్స) అనే యాప్ ద్వారా క్షేత్రస్థాయిలోనే వివరాలు, ఫొటోలు అప్లోడ్ చేసే వెసులుబాటు వచ్చింది. ప్రస్తుతం 20 మంది కంటే అధికంగా కూలీలు పనిచేస్తున్న ప్రాంతాల్లో ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. మిగతా ప్రాంతాల్లో దశలవారీగా దీన్ని అమల్లోకి తీసుకురానున్నారు.
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మరింత కట్టుదిట్టంగా అమలుచేసేందుకు కేంద్ర ప్రభుత్వం నూతన విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అవినీతిని కట్టడిచేసేందుకు మరింత ఆధునాతన సాంకేతికతను అమల్లోకి తీసుకువచ్చింది. తాజాగా కూలీల హాజరును ఎప్పటికప్పుడు నమోదు చేసేందుకు నేషనల్ మొబైల్మానిటరింగ్ సిస్టమ్ (ఎన్ఎంఎంఎ్స)ను ప్రవేశపెట్టింది. ఇందుకోసం దేశవ్యాప్తంగా మొబైల్ యాప్ను అమల్లోకి తీసుకువచ్చింది. ఈ విధానంలో ఉపాధి కూలీల హాజరును ప్రతి రోజూ రెండుసార్లు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ఉపాధి పనులు జరిగే ప్రాంతానికి సిబ్బంది వెళ్లి అక్కడ జరుగుతున్న పనులు, కూలీల ఫొటోలు స్మార్ట్ఫోన్లో తీసి యాప్లో అప్లోడ్ చేస్తారు. జీపీఎస్ ద్వారా ఆన్లైన్లో ఈ వివరాలన్నీ అప్పటికప్పుడే కేంద్ర సర్వర్లో నమోదవుతాయి. ఎన్ఎంఎంఎస్ యాప్లో అప్లోడ్ చేసే బాధ్యతను స్థానిక పంచాయతీ కార్యదర్శులకు సీనియర్ మేట్లకు అప్పగించారు. వీరు ప్రతి రోజూ కూలీల పనులు ప్రారంభించే సమయంలో అంటే ఉదయం 7గంటలకు మొదట విడత వివరాలను అప్లోడ్ చేయాలి. అలాగే పనులు ముగించే సమయంలో అంటే మధ్యాహ్నం 12 గంటలకు కూలీల హాజరు ఫొటోలు తీసి యాప్లో నమోదు చేసేవిధంగా చర్యలు తీసుకోనున్నారు. దీనివల్ల కూలీలు చేసే పనుల్లో పారదర్శకత పెరగడంతోపాటు నకిలీ కూలీలకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుంది. అలాగే ఎన్ఎంఎంఎ్స యాప్ ద్వారా ఉపాధి పనులు, కూలీల హాజరులో పారదర్శకత, పనుల్లో నాణ్యత పెరుగుతుంది. కూలీలకు సంపూర్ణ న్యాయం జరుగుతుంది. కూలీల హాజరు ఎప్పటికపుడు నమోదు చేయడం వల్ల ప్రతి కూలీకి కనీస పనిదినాలు కల్పించే విషయంపై ఉన్నతస్థాయిలో కూడా పర్యవేక్షణ ఉంటుంది. పనులపై బాధ్యత పెరిగి క్షేత్రస్థాయిలో సిబ్బంది పనులు చేసే అవకాశం ఉంటుంది. తద్వారా అనేక మందికి సకాలంలో ఉపాధి దొరుకుతుంది. ఇంతకుముందు క్షేత్రస్థాయికి సిబ్బంది వెళ్లి హాజరుశాతం పనుల వివరాలను సేకరించి మళ్లీ ఆఫీ్సకు వచ్చి ఆన్లైన్లో ఈ వివరాలను నమోదు చేయాల్సి ఉండేది. అయితే తాజాగా తీసుకువచ్చిన యాప్ వల్ల క్షేత్రస్థాయిలోనే వివరాలు, ఫొటోలు అప్లోడ్ చేసే వెసులుబాటు వచ్చింది. ప్రస్తుతం 20 మంది కంటే అధికంగా కూలీలు పనిచేస్తున్న ప్రాంతాల్లో ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. మిగతా ప్రాంతాల్లో దశలవారీగా దీన్ని అమల్లోకి తీసుకురానున్నారు. గతంలో కొన్నిచోట్ల కూలీలు పనులకు రానప్పటికీ వారు వచ్చినట్లు హాజరు నమోదు చేసి నిధులు కైంకర్యం చేసిన సంఘటనలు జరిగాయి. తాజాగా తీసుకువచ్చిన యాప్ వల్ల కూలీల హాజరు పక్కాగా నమోదవుతుంది. దీని ఆధారంగా అధికారులు తనిఖీలు, విచారణ కూడా సులభతరమవుతుంది. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా తప్పిదాలు చేసినా సాంకేతికతకు ఇట్టే దొరికిపోతారు. ఉపాధి పనులను పర్యవేక్షించే ఉన్నతాధికారులు కూలీల సంఖ్యను సులువుగా తెలుసుకోగలుగుతారు. దీంతో ఉపాధి పనుల్లో అక్రమాలు తగ్గడంతోపాటు సామాజిక తనిఖీలు సులభతరమవుతాయి. పనుల్లో నాణ్యత, పారదర్శకత పెరుగుతుంది.
సర్వర్ సమస్యలు
అయితే ఈవిధానం కొత్త కావడంతో ప్రస్తుతం క్షేత్రస్థాయిలో చిన్నచిన్న సమస్యలు వచ్చి కూలీలు, సిబ్బంది అవస్థలు పడుతున్నారు. యాప్ పనితీరును ఇంకా మెరుగుపరచాల్సి ఉంది. సర్వర్లో తరచూ సమస్యలు వస్తున్న కారణంగా వివరాల అప్లోడ్లో జాప్యం జరుగుతోంది. సిబ్బందికి కూడా పూర్తిస్థాయిలో అవగాహన రాలేదు. అలాగే మారుమూల ప్రాంతాల్లో సిగ్నల్ వ్యవస్థ సరిగా లేకపోవడంతో కూడా సమస్యలు వస్తున్నాయి. ఇందువల్ల అన్ని గ్రామాల్లో కొత్తవిధానం ఇంకా అమల్లోకి రాలేదు. దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియ ఒకేసారి మొదలుకావడంతో ఆరంభంలో ఇలాంటి సమస్యలు మామూలేనని అధికారులు చెబుతున్నారు. సర్వర్ వేగం పెరిగితే మరిన్ని గ్రామాలకు కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకువస్తారు.