గవర్నర్లతో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వీడియో కాన్ఫరెన్స్
ABN , First Publish Date - 2020-04-03T21:06:05+05:30 IST
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఇవాళ పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన ...
న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ఇవాళ పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కోవిడ్-19పై దేశ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. ఆయా రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కాగా వారం రోజుల వ్యవధిలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులు గవర్నర్లతో సమావేశం కావడం ఇది రెండోసారి కావడం గమనార్హం. తొలుత గత నెల 27న వీడియో కాన్ఫరెన్స్ జరగ్గా... అందులో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్తో పాటు అత్యధిక కరోనా కేసులు నమోదైన 14 రాష్ట్రాలకు చెందిన గవర్నర్లు పాల్గొన్నారు. కాగా మిగతా గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లతో రాష్ట్రపతి ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా రాష్ట్రాల్లో కోవిడ్-19 పరిస్థితిపై ఈ కార్యక్రమంలో ప్రధానంగా చర్చించారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు రెడ్క్రాస్ సొసైటీ, పౌర సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రయివేటు రంగాలు పోషించాల్సిన పాత్ర పైనా రాష్ట్రపతి చర్చలు జరిపారు.