సీఎం జగన్కు టీడీపీ ఎమ్మెల్యేల బహిరంగ లేఖ
ABN , First Publish Date - 2021-10-06T18:24:27+05:30 IST
సీఎం జగన్ మోహన్రెడ్డికి టీడీపీ ఎమ్మెల్యేలు బహిరంగ లేఖ రాశారు. వైసీపీ రెండేళ్ల పాలనలో ప్రకాశం జిల్లాకు ఒరిగిందేమీ లేదన్నారు.
ప్రకాశం: సీఎం జగన్ మోహన్రెడ్డికి టీడీపీ ఎమ్మెల్యేలు బహిరంగ లేఖ రాశారు. వైసీపీ రెండేళ్ల పాలనలో ప్రకాశం జిల్లాకు ఒరిగిందేమీ లేదన్నారు. వెలిగొండకు అన్యాయం జరుగుతున్నా.. సీఎం పట్టించుకోకపోవడం శోచనీయమని తెలిపారు. జిల్లాను సస్యశ్యామలం చేసే ప్రాజెక్ట్ చివరి దశకు చేరుకున్నా మోక్షం లేదని... వెలిగొండను అనుమతి కలిగిన ప్రాజెక్ట్గా గుర్తించేందుకు ప్రభుత్వం తరుపున చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రూ.274 కోట్లతో నిర్మించ తలపెట్టిన గుంటూరు ఛానల్పై నిర్లక్ష్యం తగదన్నారు. రామాయపట్నం దగ్గర రూ.25వేల కోట్లతో చేపట్టిన ఏషియన్ పల్ప్ పేపర్ మిల్లు పరిస్థితి ఏమిటని ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. 45 ఏళ్లు నిండిన మహిళలకు పెన్షన్ల అమలు ఏమైందన్నారు. ట్రూ అప్ ఛార్జీల పేరుతో ప్రజలపై రెట్టింపు ఛార్జీలు విధించడం దారుణమని మండిపడ్డారు. మద్యనిషేధమని మభ్యపెట్టి.. పిచ్చి మందులతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని వ్యాఖ్యానించారు. ఉద్యోగుల పీఆర్సీ నివేదిక ఈ ఏడాదైనా అమలుకు నోచుకోకపోవడం శోచనీయమన్నారు. అంబేద్కర్ విదేశీ విద్య బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఎత్తివేతతో.. విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని టీడీపీ ఎమ్మెల్యేలు లేఖలో పేర్కొన్నారు.