పోస్టల్‌ శాఖ ద్వారా మరిన్ని సేవలు

ABN , First Publish Date - 2020-12-06T05:06:07+05:30 IST

పోస్టల్‌శాఖ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సేవలు విస్తరిస్తున్నట్లు ఏపీ సర్కిల్‌ చీఫ్‌ పోస్టుమాస్టర్‌ జనరల్‌ ఎం.వెంకటేశ్వర్లు తెలిపారు.

పోస్టల్‌ శాఖ ద్వారా మరిన్ని సేవలు

పెనుగొండ, డిసెంబరు 5: పోస్టల్‌శాఖ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సేవలు విస్తరిస్తున్నట్లు ఏపీ సర్కిల్‌ చీఫ్‌ పోస్టుమాస్టర్‌ జనరల్‌ ఎం.వెంకటేశ్వర్లు తెలిపారు. పెనుగొండ ప్రధాన తపాలా కార్యాలయాన్ని శనివారం తనిఖీ చేశారు. అనంతరం విలేకరులతో  మాట్లాడుతూ పోస్టు మెన్‌ ద్వారా  ఏటీఎం సేవలను ఇంటికే అందిస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆధార్‌ కలిగి బ్యాంక్‌ అనుసంధానం కలిగిన ఖాతాదారులకు ఈ వెసులుబాటు ఉందన్నారు.  మారుమూల బ్యాంకులు లేనిచోట్ల పోస్టుమన్‌ ఏటీఎం సేవలు ఎంతో ప్రాచుర్యం సంతరించుకున్నాయన్నారు. ఈ ఏటీఎం ద్వారా రూ.10 వేలు మ్రామే తీసుకోవచ్చనన్నారు. కరోనా సమయంలో ఈ సదుపాయంతో ఎంతో మంది లబ్ది పొదారన్నారు. అత్యవసర మందులు కూడా పోస్టల్‌ ద్వారా అందించామన్నారు. విశ్రాంత ఉద్యోగులు పెన్షన్‌ పొందడానికి పోస్టుమ్యాన్‌ సంబంధిత ఉద్యోగి ఇంటికి వెళ్లి డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికెట్‌ను నమోదు చేసి ట్రెజరీకి పంపిస్తారన్నారు. రూ.70 చార్జీ చెల్లించాల్సి ఉంటుందన్నారు. తిరుపతి వెంకటేశ్వరస్వామి, శబరిమలై అయ్యప్పస్వామి ప్రసాదం ఆన్‌లైన్‌ ద్వారా బుక్‌ చేసి పంపిణీ చేస్తున్నామన్నారు. రైల్వే, ఆర్టీసీ టిక్కెట్‌ బుకింగ్‌లు మంచి ప్రాచుర్యం పొందాయన్నారు. కర్నూలు, విజయవాడ, వైజాగ్‌ రీజియన్‌ పోస్టల్‌ సర్కిల్‌ సేవలు దేశంలోనే ఉత్తమ సేవలందిస్తున్నాయన్నారు. పోస్టల్‌ ఇన్సూరెన్స్‌, పోస్టల్‌ సేవింగ్స్‌పై ప్రజలు మక్కువ చూపుతున్నారన్నారు. పోస్టుమాస్టర్‌ పోసిబాబు కొండేటి, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-12-06T05:06:07+05:30 IST