Strike: తపాలా సేవలకు అంతరాయం!
ABN , First Publish Date - 2022-08-11T13:59:21+05:30 IST
కేంద్ర ప్రభుత్వం తపాలా శాఖ(Postal Department)ను ప్రైవేటుపరం చేసేందుకు చేపడుతున్న చర్యలను తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తపాలా
- ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సిబ్బంది సమ్మె
చెన్నై, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం తపాలా శాఖ(Postal Department)ను ప్రైవేటుపరం చేసేందుకు చేపడుతున్న చర్యలను తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తపాలా సిబ్బంది బుధవారం సమ్మెకు దిగారు. జాతీయ తపాలా ఉద్యోగుల సమాఖ్య ఇచ్చిన పిలుపుమేరకు రాజధాని నగరంలో చెన్నైలోని తపాలా కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. నగరంలోని అన్నాసాలై ప్రధాన తపాలా కార్యాలయంలో 50 శాతం మందికి పైగా ఉద్యోగులు సమ్మె(strike) చేయడంతో తపాలా సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. నగరంలో నార్త్బీచ్, పార్క్టౌన్, టి.నగర్, అన్నానగర్, ఎగ్మూరు తదితర ప్రాంతాల్లోని తపాలా కార్యాలయాల్లో స్వల్పంగా ఉద్యోగులు విధులకు హాజరయ్యారు. దీంతో పోస్టాఫీసుకు వెళ్లిన వారంతా తిరుగుముఖం పట్టారు. ఈ విషయమై నగరానికి చెందిన తపాల ఉద్యోగులు సంఘం నాయకుడొకరు మాట్లాడుతూ... దశాబ్దాలుగా ప్రజలకు సేవలందిస్తున్న తపాలా శాఖను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటుపరం చేయడానికి చర్యలు చేపడుతోందని ఆరోపించారు. రెండేళ్లుగా కరోనా లాక్డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా తపాలా ఉద్యోగులు ప్రాణాలకు తెగించి నిర్విరామ సేవలందించారని పేర్కొన్నారు. ఇక కరోనా బారినపడి మృతి చెందిన తపాలా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం రూ.10లక్షల నష్టపరిహారాన్ని కూడా చెల్లించలేదని, కరోనా మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి కారుణ్య ప్రాతిపదికన ఉద్యోగవకాశం కూడా కల్పించలేదని ఆరోపించారు. లాభాలు తగ్గిపోయాయనే కుంటి సాకుతో తపాలాశాఖ(Postal Department)ను ప్రైవేటు పరం చేయడం తగదని, ఆ శాఖ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ప్రైవేటు కొరియర్ సర్వీసులకు ధీటుగా లాభాలను ఆర్జించవచ్చునని పేర్కొన్నారు.