ఉత్తర ప్రదేశ్లో ‘పోస్టాఫీస్ ఆన్ వీల్స్’ సేవల విస్తరణ
ABN , First Publish Date - 2020-04-01T03:33:13+05:30 IST
కరోనా వైరస్ మహమ్మారి వేధింపుల నేపథ్యంలో ‘పోస్టాఫీస్ ఆన్ వీల్స్’ సేవలను విస్తరించేందుకు ఇండియా పోస్ట్ నిర్ణయించింది.
న్యూఢిల్లీ : కరోనా వైరస్ మహమ్మారి వేధింపుల నేపథ్యంలో ‘పోస్టాఫీస్ ఆన్ వీల్స్’ సేవలను ఇండియా పోస్ట్ మంగళవారం నుంచి విస్తరించింది. ఉత్తర ప్రదేశ్లోని ఆగ్రా, బరేలీలకు ఈ విధానంలో తపాలా సేవలను నిరంతరాయంగా అందజేసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
‘పోస్టాఫీస్ ఆన్ వీల్స్’ సేవలను అన్ని సర్కిల్స్కు విస్తరించాలని తపాలా శాఖను కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ సోమవారం ఆదేశించారు.
కరోనా వైరస్ మహమ్మారిపై పోరాటం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా 21 రోజులపాటు అష్ట దిగ్బంధనం పాటించాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని రకాల రవాణా సదుపాయాలు ప్రజలకు దూరమయ్యాయి. దీంతో సంచార వాహనాలపై తపాలా సేవలను ప్రజలకు అందుబాటులోకి తేవడం ప్రయోజనకరమే.