22 కిలోల గంజాయి స్వాధీనం

ABN , First Publish Date - 2020-02-20T09:52:50+05:30 IST

నగరంలోని మద్రాసు బస్టాండు సమీపంలో మంగళవారం రాత్రి చిన్నబజారు పోలీసులు నిషేధిత

22 కిలోల గంజాయి స్వాధీనం

ఇద్దరు మహిళల అరెస్ట్‌


నెల్లూరు (క్రైం) ఫిబ్రవరి 19 : నగరంలోని మద్రాసు బస్టాండు సమీపంలో మంగళవారం రాత్రి చిన్నబజారు పోలీసులు నిషేధిత గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. ఆ వివరాలు నగర డీఎస్పీ జే శ్రీనివాసులరెడ్డి చిన్నబజారు పోలీసు స్టేషన్‌లో విలేకర్ల సమావేశంలో బుధవారం తెలిపారు. తమిళనాడు ప్రాంతం తేని జిల్లా తేవారం గ్రామానికి చెందిన తంగయాయన్‌ మణిమాల, తేని జిల్లా గుడలర్‌ ప్రాంతానికి చెందిన జయపాల్‌ తమిళ్‌ రాశి  గంజాయి అక్రమంగా రవాణాచేసి  నెల్లూరు, పాడేరు, చోడవరం పోలీసు స్టేషన్లలో పట్టుబడి జైలుకు వెళ్లారన్నారు. జయపాల్‌ తమిళ్‌ రాశి 15 రోజుల కిందటే బెయిల్‌పై విడుదలయి వియ్యపురాలితో కలిసి విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో పాడేరు చుట్టు ప్రక్కల ప్రాంతాల నుంచి గంజాయి సేకరించి తమిళనాడుకు తరలిస్తోంది.


అయితే మార్గ మధ్యంలో ఓ కేసుకు సంబంధించి నెల్లూరు రూరల్‌ పోలీసు స్టేషన్‌లో కండీషన్‌ బెయిల్‌పై పోలీసుల ఎదుట గురువారం ఆమె హాజరు కావలసి ఉండగా నెల్లూరులోని ఒక లాడ్జిలో గురువారం వరకు ఉండి పోలీసుల ఎదుట హజరై తిరిగి తమిళనాడుకు గంజాయి తరలించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి మద్రాసు బస్టాండు దగ్గర మురళీకృష్ణ హోటల్‌ వద్ద నిందితులు ఆటో ఆపుతున్న సమయంలో చిన్నబజారు పోలీసు స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ మధుబాబు మధ్యవర్తుల సమక్షంలో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి  నుంచి 22 కిలోల గంజాయి, రెండు సెల్‌ఫోన్లు, రూ.1450 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో ఎస్‌ఐ రవినాయక్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2020-02-20T09:52:50+05:30 IST