ఇన్స్టాగ్రామ్లో పరిచయం చేసుకొని అఘాయిత్యాలు
ABN , First Publish Date - 2020-12-04T18:40:27+05:30 IST
ఇన్స్టా గ్రామ్ ద్వారా అమ్మాయిలు, బాలికలతో పరిచయం పెంచుకుంటాడు. వారికి మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడుతున్న నిందితుడిని మీర్పేట పోలీసులు అరెస్టు చేశారు.
మాయమాటలతో మభ్యపెట్టి బాలికపై అత్యాచారం
నిందితుడి అరెస్టు.. పోక్సో కేసు నమోదు
సరూర్నగర్, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): ఇన్స్టా గ్రామ్ ద్వారా అమ్మాయిలు, బాలికలతో పరిచయం పెంచుకుంటాడు. వారికి మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడుతున్న నిందితుడిని మీర్పేట పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్పెక్టర్ మహేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా, చేర్యాల మండలం, కొమురవెల్లికి చెందిన తరిగొప్పుల వెంకటస్వామి(23) ఐటీఐ పూర్తి చేశాడు. ఇన్స్టాగ్రామ్లో అమ్మాయిలకు హాయ్ చెప్పి పరిచయం చేసుకునేవాడు. వారితో చనువు పెంచుకున్న తర్వాత వాట్సా్పనకు అసభ్యకరమైన మెసేజ్లు, ఫొటోలు పంపించేవాడు. అనంతరం ప్రేమ, పెళ్లి పేరు చెప్పి మాయమాటలు చెప్పి మోసం చేసేవాడు. ఈ క్రమంలో మీర్పేట్ పీఎస్ పరిధిలో ఏడో తరగతి చదువుతున్న బాలికను నెల రోజుల క్రితం ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం చేసుకున్నాడు. ఆన్లైన్ తరగతులు వింటున్న బాలిక మొబైల్ ఫోన్ వాడుతుండడంతో నిందితుడి మెసేజ్కు సమాధానం ఇచ్చింది. దీనిని అవకాశంగా తీసుకున్న అతడు బాలికకు మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. అతడు ఇటీవల బాలికకు ఫోన్ చేసి తాను చెప్పిన ప్రాంతానికి రావాలని, లేకపోతే మీ అమ్మను కిడ్నాప్ చేస్తానని బెదిరించాడు.
బుధవారం సాయంత్రానికల్లా దుస్తులు, డబ్బు తీసుకుని ఘట్కేసర్ బస్టాండ్కు రావాలని హెచ్చరించాడు. భయాందోళనకు గురైన బాలిక బుధవారం రెండు గంటలకు అతడు చెప్పిన ప్రాంతానికి వెళ్లింది. నిందితుడు బైక్పై వచ్చి ఆమెను తన గదికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీ, ఫోన్కాల్ లిస్ట్ ఆధారంగా గురువారం బాలికను ఏఎ్సరావునగర్లోని రాధిక క్రాస్ రోడ్డులో గల ఆర్ఎస్ బ్రదర్స్ వద్ద గుర్తించి పీఎస్కు తీసుకువచ్చారు. బాలిక జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పింది. నిందితుడిని ఘట్కేసర్లో అరెస్టు చేశారు. పోక్సో కేసు నమోదు చేసి గురువారం రిమాండ్కు తరలించామని ఇన్స్పెక్టర్ తెలిపారు. నిందితుడిపై మరో రెండు కేసులు ఉన్నట్టు విచారణలో తేలిందని, వాటిపైనా విచారణ చేపట్టి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.