డ్రగ్స్‌పై నున్నలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల జల్లెడ

ABN , First Publish Date - 2022-05-21T06:20:24+05:30 IST

విదేశాల నుంచి దిగుమతయ్యే మెథాంఫిటమైన్‌పై నున్నలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు జల్లెడ పట్టారు.

డ్రగ్స్‌పై నున్నలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల జల్లెడ

  పోలవరం కట్ట పొడవునా సోదాలు

 గుంపులు గుంపులున్న ప్రాంతాలపై నిఘా

విజయవాడ రూరల్‌, మే 20 : విదేశాల నుంచి దిగుమతయ్యే మెథాంఫిటమైన్‌పై నున్నలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు జల్లెడ పట్టారు. బెంగళూరు నుంచి కర్నూలు మీదగా నున్న వస్తున్న మెథాంఫిటమైన్‌కు స్థానికంగా రిటైలర్స్‌ ఉన్నట్లు కర్నూలు సీసీఎస్‌ పోలీసుల విచారణలో తేలింది. నున్నకు చెందిన రిటైలర్స్‌ యశ్వంత్‌రెడ్డి, ఏకేశ్వర్‌రెడ్డిని ఇప్పటికే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. ‘మత్తుకు అడ్డా.. పోలవరం కట్ట’ అనే శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో గురువారం వార్త ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో నగర పోలీసు కమిషనర్‌ కాంతిరాణా ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్‌ ఏసీపీలు రమణమూర్తి, వర్మ పర్యవేక్షణలో నాలుగైదు బృందాలు నున్నలో గురువారం రాత్రి వరకు జల్లెడపట్టాయి. స్థానిక పోలవరం కట్ట పొడవునా టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు తనిఖీలు చేపట్టారు. సాయిబాబా గుడి వెనుక వైపున ఎర్ర చెరువు ప్రాంతంలోనూ తనిఖీలు నిర్వహించారు. శివారు ప్రాంతాల్లో గంజాయితోపాటు డ్రగ్స్‌ వినియోగించే యువత ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో అణువణువునా పోలీసులు సోదాలు చేపట్టారు. గ్రామంలోనూ పలు కూడళ్లలో గుంపులు గుంపులుగా ఉన్న యువతపై ప్రత్యేకంగా నిఘా పెట్టారు. అనుమానాస్పదంగా కనిపించిన వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఒకే ప్రాంతంలో 50 మందికిపైగా డ్రగ్స్‌ వినియోగదారులు ఉన్నారన్న సమాచారంతో ఆ ప్రాంతంపై ప్రత్యేక నిఘా పెట్టారు. విజయవాడ పరిసర ప్రాంతాల నుంచి గంజాయిసహా మత్తు పదార్ధాలను సరఫరా చేసే వారిపైనా ప్రత్యేకంగా నిఘా ఉంచినట్లు ఏసీపీలు రమణమూర్తి, వర్మ తెలిపారు. ఈ విషయంలో స్థానికులు కూడా పోలీసులకు సహకరించాలన్నారు. యువత మత్తుకు బానిసకావడం వల్ల వారి జీవితాలు నాశనమవుతాయని, ఈ నేపథ్యంలో ప్రజలంతా మాదకద్రవ్యాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. 

Updated Date - 2022-05-21T06:20:24+05:30 IST