పోచంపల్లి ‘పోతన’ నరసింహులు కవి మృతి
ABN , First Publish Date - 2021-11-06T06:55:05+05:30 IST
పోచంపల్లి పోతనగా పేరొందిన భూదానపోచంపల్లికి చెందిన సహజకవి కైరంకొండ నరసింహులు గురువారం మృతి చెందారు.
భూదానపోచంపల్లి, నవంబరు 5: పోచంపల్లి పోతనగా పేరొందిన భూదానపోచంపల్లికి చెందిన సహజకవి కైరంకొండ నరసింహులు గురువారం మృతి చెందారు. ము న్సిపల్ కేంద్రంలోని మార్కండేయనగర్ కాలనీకి చెందిన నరసింహులు చిన్నతనం నుంచి పౌరాణిక చిత్రాలు చూసి పద్యాలపై ఆసక్తి పెంచుకున్నారు. ఇతడు చదివింది పాఠశాల విద్యే అయినా పద్యంపై మక్కువతో చందస్సు పుస్తకాలు చదివి పద్యాలను రాస్తూ కవిగా పేరొందారు. చేనేత వృత్తి చేస్తూనే.. పద్మశాలీ శతకం, భార్గవీ శతకం, శ్రీరామ శతకం, బసవలింగ శతకం రాసి పుస్తకాలను ప్రచురించారు. అంతేకాక భజన కీర్తనలు కూడా రాసేవారు. పలు యక్షగానాలను రాసి, ప్రదర్శించారు. సీతాపతి సినిమా సందడి, నేటి భారతం సాంఘిక నాటకాలు రచించి ప్రదర్శించారు. ఈయన ప్రతిభను గుర్తించిన గోరేటి వెంకన్న స్వయంగా నరిసింహులు ఇంటికి వచ్చి ఘనం గా సన్మానించారు. పో చంపల్లి పోతనగా పేరుగాంచిన ఈయన కవి సమ్మేళన కార్యక్రమాల్లో పాల్గొని తన గానం వినిపించేవారు. పలు సాహితీ అంశాలతో రాణించి పద్యమే శ్వాసగా బతికిన నరసింహులు 4న తుదిశ్వాస విడిచారు. ఇతని మృతి పట్ల స్థానిక త్రివేణి సాహితీ సంఘం ప్రతినిధులు, కవులు, కళాకారులు సంతాపం తెలిపారు.