సాగుకు లక్ష కోట్ల మౌలిక నిధి

ABN , First Publish Date - 2020-08-10T06:22:10+05:30 IST

పంట ఉత్పత్తి తర్వాత రైతులకు అవసరమైన మౌలిక సదుపాయల అభివృద్ధికి.. రూ.లక్ష కోట్లతో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (అగ్రి-ఇన్‌ఫ్రా ఫండ్‌)ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది...

సాగుకు లక్ష కోట్ల మౌలిక నిధి


  • గ్రామీణ ప్రాంతాల్లో శీతల గిడ్డంగులు
  • రైతులకు మేలు, కొత్త ఉద్యోగాలు, 
  • స్టార్ట్‌ప్సకు అవకాశాలు: మోదీ
  • వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభం
  • పీఎం-కిసాన్‌ పథకం కింద 8.5 కోట్ల 
  • రైతులకు రూ. 17వేల కోట్లు విడుదల
  • రాష్ట్రంలో 34.69 లక్షల మందికి లబ్ధి
  • ఖాతాల్లో రూ.693.80 కోట్లు జమ

న్యూఢిల్లీ, ఆగస్టు 9: పంట ఉత్పత్తి తర్వాత రైతులకు అవసరమైన మౌలిక సదుపాయల అభివృద్ధికి.. రూ.లక్ష కోట్లతో వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి (అగ్రి-ఇన్‌ఫ్రా ఫండ్‌)ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పంటల నిల్వకు శీతల గిడ్డంగులు, సేకరణ కేంద్రాలు, ప్యాకింగ్‌   సదుపాయాల కల్పనకు కేంద్రం ఈ నిధులను  మంజూరు చేస్తుంది. ఈ విధానం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన అవకాశాలు నెలకొంటాయని చెబుతున్నారు. 


బలరాముడి జయంతి నాడు..

వ్యవసాయంలో ప్రధానమైన నాగలిని ఆయుధంగా కలిగి ఉండే బలరాముడి జయంతి సందర్భంగా ఆదివారం ఈ పథకాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌, పలు రాష్ట్రాల రైతులు పాల్గొన్నారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘పంట ఉత్పత్తి తర్వాత అవసరమైన గిడ్డంగులు, శీతల గిడ్డంగుల ఏర్పాటు వంటి మౌలిక వసతులు ఈ పథకం ద్వారా పెరుగుతాయి. కొత్త ఉద్యోగాలు వస్తాయి. రైతులకు మేలు జరుగుతుంది. వ్యవసాయంలో స్టార్ట్‌ప్సకు మంచి అవకాశాలు ఏర్పడతాయి’ అని  అన్నారు. గుజరాత్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌కు చెందిన తొలి లబ్ధిదారులైన రైతులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మోదీ మాట్లాడారు. నిత్యావసరాలను పరిమితికి మించి నిల్వ ఉంచుకోవద్దని పేర్కొనే ఎసెన్షియల్‌ కమాడిటీస్‌ చట్టం (ఈసీ యాక్ట్‌) ఇప్పుడు అవసరం లేదని, గ్రామీణ ప్రాంతాల్లో మంచి గోదాములు నిర్మించుకునేందుకు ఈ చట్టం ప్రతిబంధకంగా ఉందన్నారు.  వ్యాపారులు, పెట్టుబడిదారులను బెదిరించేందుకు ఈ చట్టం దుర్వినియోగం చేశారని, ఇప్పుడు వారికి ఆ భయాలేమీ అక్కర్లేదని, వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి కింద క్రెడిట్‌ సౌకర్యాలు కల్పించవచ్చునని చెప్పారు. కాగా, ఈ పథకం కోసం 11 ప్రభుత్వ రంగ బ్యాంకులతో కేంద్రం ఒప్పందం కుదుర్చుకుంది. ప్రైమరీ అగ్రికల్చర్‌ క్రెడిట్‌ సొసైటీ (పీఏసీఎ్‌స)ల ద్వారా రైతులకు నిధులు మంజూరు చేస్తారు.   కాగా పీఎం-కిసాన్‌ పథకం కింద 8.5 కోట్ల మంది రైతుల కోసం రూ.17వేల కోట్లను మోదీ విడుదల చేశారు. ఆరో విడత కింద విడుదల చేసిన ఈ నిధులు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో పడతాయి. రైతుల ఆర్థిక అవసరాలను తీర్చేదిగా పీఎం-కిసాన్‌ పథకం విజయవంతమైందని మోదీ అన్నారు. అగ్రి-ఇన్‌ఫ్రా ఫండ్‌.. రైతులకు మేలు చేస్తుందని, ఉద్యోగాలను సృష్టిస్తుందని, గ్రామాలు ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు ఉపయోగపడుతుందని హోం మంత్రి అమిత్‌ షా ట్వీట్‌ చేశారు. 


వ్యాపారానికి అండమాన్‌ దీవులు కీలకం

ఆత్మ నిర్భర భారత్‌ కార్యక్రమానికి అండమాన్‌, నికోబార్‌ దీవులు ఎంతో కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆ దీవులకు శనివారం సబ్‌మరైన్‌ ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ సౌకర్యాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో అక్కడి బీజేపీ కార్యకర్తలతో మోదీ మాట్లాడారు. సముద్ర వ్యాపారం కోసం అండమాన్‌, నికోబార్‌ దీవుల్లోని 12 దీవులను కీలక ప్రాజెక్టుల కోసం ఎంపిక చేశామని చెప్పారు.

Updated Date - 2020-08-10T06:22:10+05:30 IST