కూచ్ బిహార్లో కాల్పులు... మమతపై మోదీ ఆగ్రహం...
ABN , First Publish Date - 2021-04-10T20:24:15+05:30 IST
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ ప్రజలను రెచ్చగొడుతున్నారని
కోల్కతా : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ ప్రజలను రెచ్చగొడుతున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. కూచ్ బిహార్లో సీఐఎస్ఎఫ్ కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సిలిగురిలో శనివారం జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడుతూ, కూచ్ బిహార్లో చాలా విషాదకరమైన సంఘటన జరిగిందన్నారు. ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి మృతిపట్ల ప్రగాఢ సంతాపం తెలిపారు. బీజేపీకి ప్రజలు మద్దతిస్తుండటాన్ని మమత బెనర్జీ, ఆమె గూండాలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. తన కుర్చీ చేజారుతోందని ఆమెకు తెలుసునని, అందుకే ఇంత నీచ స్థాయికి దిగజారిపోయారని దుయ్యబట్టారు.
మమత బెనర్జీ, టీఎంసీ, వారి గూండాలకు ఓ విషయాన్ని స్పష్టంగా చెప్పాలనుకుంటున్నానని మోదీ అన్నారు. దానిని వివరిస్తూ, పశ్చిమ బెంగాల్లో వారి విధానాలను అమలు చేయడానికి అనుమతించబోమని చెప్పారు. కూచ్ బిహార్ ఘటనలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ను కోరారు.
‘‘దీదీ, ఈ హింసాకాండ, భద్రతా దళాలపై దాడికి ప్రజలను రెచ్చగొట్టే చిట్కాలు, పోలింగ్ ప్రక్రియకు ఆటంకం కలిగించే చిట్కాలు మిమ్మల్ని కాపాడవు. పదేళ్ళ మీ తప్పుడు పాలన నుంచి ఈ హింసాకాండ మిమ్మల్ని రక్షించదు’’ అని మోదీ అన్నారు. బెంగాల్లో అనేక దశాబ్దాల నుంచి కొనసాగుతున్న రాజకీయ వాతావరణంలో మార్పునకు సమయం ఆసన్నమైందన్నారు. బలవంతపు వసూళ్ళ నుంచి విముక్తి పొందిన బెంగాల్ రాబోతోందన్నారు. సిండికేట్, కట్ మనీల నుంచి విముక్తి పొందిన బెంగాల్ ఏర్పడబోతోందని చెప్పారు.
పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికల్లో నాలుగో విడత పోలింగ్ శనివారం జరుగుతోంది. కూచ్ బిహార్లోని సీతల్కుచ్చిలోని పోలింగ్ బూత్ వెలుపల సీఐఎస్ఎఫ్ కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై మమత బెనర్జీ స్పందిస్తూ, తన భయాందోళన నిజమైందన్నారు. కేంద్ర బలగాల పట్ల తాను వ్యక్తం చేసిన ఆందోళనలో వాస్తవం ఉందని ఈ సంఘటన రుజువు చేసిందన్నారు.