‘లైట్ హౌస్’తో సహకార సమాఖ్య విధానం బలోపేతం : మోదీ
ABN , First Publish Date - 2021-01-01T20:13:04+05:30 IST
పేద, మధ్య తరగతి వర్గాలవారికి గృహ వసతి కల్పించేందుకు మన దేశం
న్యూఢిల్లీ : పేద, మధ్య తరగతి వర్గాలవారికి గృహ వసతి కల్పించేందుకు మన దేశం నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆరు రాష్ట్రాల్లో లైట్ హౌస్ ప్రాజెక్టుల కోసం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించడం సహకారాత్మక సమాఖ్య విధానాన్ని బలోపేతం చేయడమేనని చెప్పారు.
నిర్మాణ రంగంలో నూతన టెక్నాలజీలను అభివృద్ధిపరచేందుకు తగిన అవకాశాలను గ్లోబల్ హౌసింగ్ టెక్నాలజీ ఛాలెంజ్ కల్పించిందన్నారు. రాంచీలో ఇళ్ల నిర్మాణానికి త్రీడీ కన్స్ట్రక్షన్ సిస్టమ్ను ఉపయోగిస్తామని తెలిపారు. అమెరికా, ఫిన్లాండ్ల నుంచి వచ్చిన ప్రీ కాస్ట్ టెక్నాలజీని చెన్నైలో వినియోగిస్తున్నట్లు చెప్పారు. ఫ్రాన్స్, జర్మనీ, న్యూజిలాండ్ దేశాల నుంచి సేకరించిన టెక్నాలజీలను ఇతర ప్రాంతాల్లో ఉపయోగిస్తున్నట్లు తెలిపారు.
ఇండోర్, రాజ్కోట్, చెన్నై, రాంచీ, అగర్తల, లక్నోలలో వచ్చే సంవత్సరం జనవరి 26నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందని, ఒక్కొక్క సైట్లో 1,000 ఇళ్ల చొప్పున నిర్మితమవుతాయని తెలిపారు. వివిధ విశ్వవిద్యాలయాలు, సంస్థలలో చదువుతున్న విద్యార్థులకు ఈ నిర్మాణ కేంద్రాలు బోధనా కేంద్రాలుగా ఉపయోగపడతాయన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలుసుకునేందుకు విద్యార్థులు ఈ సైట్లకు వెళ్లవచ్చునని తెలిపారు. స్థానిక అవసరాలకు తగిన విధంగా వాటిని తీర్చిదిద్దవచ్చునని తెలిపారు.
ఇళ్ల నిర్మాణంలో కొత్త టెక్నాలజీలతో ఓ సర్టిఫికేట్ కోర్సును ప్రారంభించినట్లు చెప్పారు. గతంలో హౌసింగ్ ప్లాన్స్ కేంద్ర ప్రభుత్వానికి ప్రాధాన్యతాంశంగా ఉండేవి కాదన్నారు. నిర్మాణం నాణ్యతపట్ల గత ప్రభుత్వాలు దృష్టి పెట్టేవి కాదని చెప్పారు.
గ్లోబల్ హౌసింగ్ టెక్నాలజీ ఛాలెంజ్-ఇండియా (జీహెచ్టీసీ-ఇండియా) పథకంలో భాగంగా లైట్ హౌస్ ప్రాజెక్టులను ఇండోర్, రాజ్కోట్, చెన్నై, రాంచీ, అగర్తల, లక్నోలలో నిర్మిస్తున్నారు. అత్యాధునిక టెక్నాలజీలను అందరికీ గృహ వసతి కల్పించడం కోసం గరిష్ఠ స్థాయిలో ఉపయోగించుకుంటున్నట్లు మోదీ ఓ ట్వీట్లో పేర్కొన్నారు.