కరోనాపై ఉమ్మడి పోరుకు భారత్-నేపాల్ అంగీకారం

ABN , First Publish Date - 2020-04-10T20:42:35+05:30 IST

ప్రపంచ వ్యాప్తంగా మరణ మృదంగం మోగిస్తున్న మహమ్మారి కొవిడ్-19పై ఉమ్మడి పోరాటం చేసేందుకు భారత్, నేపాల్..

కరోనాపై ఉమ్మడి పోరుకు భారత్-నేపాల్ అంగీకారం

న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా మరణ మృదంగం మోగిస్తున్న కొవిడ్-19 మహమ్మారిపై ఉమ్మడిగా పోరాడేందుకు భారత్, నేపాల్ అంగీకరించాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలితో ఇవాళ టెలీఫోన్ సంభాషణ జరిపిన సందర్భంగా ఈ మేరకు అంగీకరించారు. ‘‘ఇవాళ నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలితో మాట్లాడాను. కొవిడ్-19 వల్ల తలెత్తున్న పరిస్థితి చర్చలు జరిపాం. ఈ మహమ్మారిపై పోరాడేందుకు నేపాల్ ప్రజలకున్న సంకల్పాన్ని అభినందిస్తున్నాను. కోవిడ్-19పై సమిష్టి పోరు కోసం మేము నేపాల్‌కు సంఘీభావం తెలుపుతున్నాం... ’’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.


కాగా ప్రధాని ట్వీట్ చేసిన కొద్ది నిమిషాలకే నేపాల్ ప్రధాని ట్విటర్లో స్పందిస్తూ.. ‘‘భారత్ ప్రధాని నరేంద్ర మోదీతో నేను ఇవాళ ఫోన్‌లో మాట్లాడాను. కరోనావైరస్‌పై మరింత నిబద్ధతతో పోరాడాలని పరస్పరం అంగీకరించాం. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్‌డౌన్ సమయంలో ఇరువైపులా చిక్కుకున్న మా పౌరులను క్షేమంగా చూసుకోవాలని గట్టిగా నిర్ణయించాం...’’ అని పేర్కొన్నారు. గతనెల 25 నుంచి భారత్‌లో లాక్‌డౌన్ అమలు చేస్తుండగా.. నేపాల్‌లో అంతకంటే ముందురోజు నుంచే లాక్‌డౌన్ ప్రకటించారు. దీంతో ఇరుదేశాలకు చెందిన అనేకమంది ప్రజలు ఎక్కడివారక్కడే చిక్కుకుపోయారు. 

Updated Date - 2020-04-10T20:42:35+05:30 IST