ఆఫ్ఘనిస్థాన్‌పై మోదీ కీలక సమావేశం

ABN , First Publish Date - 2021-08-18T01:30:08+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం భద్రతా

ఆఫ్ఘనిస్థాన్‌పై మోదీ కీలక సమావేశం

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం భద్రతా వ్యవహారాలపై కేబినెట్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆఫ్ఘనిస్థాన్‌ ప్రభుత్వాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో అక్కడి పరిస్థితులపై చర్చించారు. ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శృంగ్ల సహా సీనియర్ మంత్రులు, ఉన్నతాధికారులు, ఆఫ్ఘనిస్థాన్‌లో భారత రాయబారి రుద్రేంద్ర టాండన్ పాల్గొన్నారు. 


ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకోవడంతో అక్కడి భారతీయులను అత్యవసరంగా మన దేశానికి రప్పించిన సంగతి తెలిసిందే. రుద్రేంద్ర టాండన్ కూడా కాబూల్ నుంచి వచ్చి, ప్రధాని మోదీ నివాసంలో జరిగిన భద్రతా వ్యవహారాలపై కేబినెట్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. 


ఇదిలావుండగా, కాబూల్ నుంచి భారతీయులను రప్పించడానికి తీసుకుంటున్న అన్ని చర్యలను ప్రధాని మోదీ సోమవారం రాత్రి వరకు నిరంతరం సమీక్షించారు. కాబూల్‌లోని ఇండియన్ ఎంబసీ సిబ్బందితో విమానం బయల్దేరే వరకు మోదీ నిరంతరం సమీక్షించారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో భోజనం ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వీరు ప్రయాణించిన విమానం జామ్‌నగర్‌లో కాసేపు ఆగి, న్యూఢిల్లీకి మంగళవారం ఉదయం చేరుకుంది. 


Updated Date - 2021-08-18T01:30:08+05:30 IST