మంగళవారం కీలక ప్రకటన చేయనున్న ప్రధాని మోదీ!

ABN , First Publish Date - 2020-04-10T16:54:47+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాక్‌డౌన్‌పై మంగళవారం కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ఆ రోజు

మంగళవారం కీలక ప్రకటన చేయనున్న ప్రధాని మోదీ!

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాక్‌డౌన్‌పై మంగళవారం కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. ఆ రోజు జాతినుద్దేశించి ప్రసంగిస్తూ లాక్‌డౌన్ పొడగించాలా? వద్దా? అన్న నిర్ణయాన్ని వెల్లడిస్తారని ఢిల్లీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నిర్ణయాన్ని ప్రకటించే ముందే అదే రోజు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం లాక్‌డౌన్ పొడగింపుకే మోదీ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.


అయితే అనేక మార్పులతో లాక్‌డౌన్ కొనసాగిస్తారని సమాచారం. అంతర్రాష్ట్ర రవాణాపై ఆంక్షలు విధించనున్నట్లు సమాచారం. అయితే అత్యవసర సర్వీసులకు మాత్రం ఇందుకు మినహాయింపు ఇవ్వనున్నారని సీనియర్ అధికారులు తెలిపారు. ఇక, విద్యా సంస్థలు, ప్రార్థనా మందిరాలను మూసే ఉంచుతారని స్పష్టం చేశారు.


దేశవ్యాప్త లాక్‌డౌన్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతిన్న కారణంగా, కొన్ని రంగాలకు ప్రత్యేక మినహాయింపులు ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే అక్కడ సామాజిక దూరం కచ్చితంగా పాటించాలన్న కఠిన నిబంధనలను కేంద్రం విధించినుంది. అత్యంతగా నష్టపోయిన రంగాల్లో విమాన రంగం ప్రథమ వరుసలో ఉంది. దీంతో విమానాల రాకపోకలను క్రమంగా ప్రారంభించవచ్చని అయితే, అన్ని తరగతులలో మధ్య సీటు ఖాళీగా ఉంచాలన్న నిబంధనను తెరపైకి తేనున్నట్లు సమాచారం. 


అన్ని పార్టీల ఫ్లోర్‌లీడర్లతో సమావేశం సందర్భంగా మోదీ మాట్లాడతూ.... ఒకేసారి లాక్‌డౌన్ ఎత్తేసే పరిస్థితి లేదని నిర్మొహమాటంగా తెలిపారు. దేశంలోని ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. దేశంలో పరిస్థితి చూస్తుంటే ‘సామాజిక అత్యవసర పరిస్థితి’ తో సమానంగా ఉందని, కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని ప్రధాని మోదీ పేర్కొన్న విషయం తెలిసిందే. 

Updated Date - 2020-04-10T16:54:47+05:30 IST