దండం పెడతా.. బయటకు రావద్దు: వైసీపీ ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2020-03-30T14:54:57+05:30 IST

చేతులెత్తి దండం పెడతున్నా..

దండం పెడతా.. బయటకు రావద్దు: వైసీపీ ఎమ్మెల్యే

క్రోసూరు(గుంటూరు): చేతులెత్తి దండం పెడతున్నా... నియోజకవర్గంలోని ప్రజలెవరూ మరో రెండు వారాల పాటు ఇళ్ళలో నుంచి బయటకు రావద్దు... అని ఎమ్మెల్యే నంబూరు శంకరరావు కోరారు. ఆదివారం క్రోసూరులోని వైసీపీ నియోజకవర్గ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. లాక్‌డౌన్‌ వలన నియోజకవర్గంలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. మిర్చి కోతలు ఆగిపోవడంతో వలస రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని, సామాజిక దూరాన్ని పాటించైనా కూలీలను మిర్చి కోతలకు అనుమతించాలని అధికారులకు సూచించారు.


నియోజకవర్గంలో మంచినీటి ఎద్దడి నెలకొన్న గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయనున్నట్టు తెలిపారు. నియోజకవర్గంలో కరోనా అనుమానితుల కోసం వంద పడకలను సిద్ధం చేశామని, ఎవరికైనా లక్షణాలు కనపడగానే సంబంధిత ఆరోగ్య అధికారికి, ఎంపీడీవోకు, తహసీల్దార్‌కు తెలపాలని కోరారు. క్రోసూరుకు చెందిన గంజనబోయిన శ్రీనివాసరావు కరోనా బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50 వేల చెక్కును ఎమ్మెల్యేకు అందజేశారు. 


Updated Date - 2020-03-30T14:54:57+05:30 IST