మూడు వరుసల్లో మొక్కలు నాటాలి
ABN , First Publish Date - 2022-05-28T05:10:23+05:30 IST
మూడు వరుసల్లో మొక్కలు నాటాలి
- హరితహారం సమీక్షలో కలెక్టర్ నిఖిల
వికారాబాద్, మే27: తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లాలో ఈసారి రోడ్లకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ మూడు వరుసల్లో పెద్దఎత్తున చేపట్టాలని కలెక్టర్ నిఖిల తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లో అటవీశాఖ అధికారి, డీఆర్డీవోతో కలిసి హరితహారంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. జిల్లాలో ఈసారి గతంలో కన్న భిన్నంగా పెద్ద ఎత్తున పెద్దసైజులో మొక్కలతో అవెన్యూ ప్లాంటేషన్ చేసి జిల్లాను పచ్చగా చేయాలన్నారు. స్థలాలను గుర్తించి ఐదురోజుల్లో గుంతలు తవ్వే పనులు పూర్తి చేయాలన్నారు. గ్రీన్ బడ్జెట్ను 100శాతం వినియోగించుకోవాలన్నారు. తాండూరు పట్టణంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలన్నారు. ప్రతి షాపు ఎదురుగా మొక్కలు నాటించి, సంరక్షించాలని సూచించారు. ప్రతి రైసు మిల్లులో 100 మొక్కలు, అంగన్వాడీ కేంద్రంలో 20 మొక్కల చొప్పున మొక్కలు నాటి, సంరక్షించాలని సూచించారు. ప్రతి విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద 40 మొక్కలు నాటించాలన్నారు. జూన్ మాసంలో జిల్లాకు ముఖ్యమంత్రి వచ్చే అవకాశం ఉన్నందున వికారాబాద్ పట్టణంలో అవెన్యూ ప్లాంటేషన్ పెద్ద ఎత్తున చేపట్టాలని మునిసిపల్ కమిషనర్ను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎ్ఫవో వేణుమాదవ్, డీఆర్డీవో కృష్ణన్, వికారాబాద్ ఆర్డీవో విజయ్ కుమారి పాల్గొన్నారు.