పైడిమాంబ పండగ

ABN , First Publish Date - 2022-08-11T05:29:27+05:30 IST

ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి పైడితల్లమ్మ పండుగకు ముహూర్తం ఖరారు చేశారు.

పైడిమాంబ పండగ
వివరాలు తెలియజేస్తున్న ధర్మకర్తల మండలి సభ్యులు


అక్టోబరు 10న తొలేళ్లు
11న సిరిమానోత్సవం
సెప్టెంబరు 17న పందిరిరాట
విజయనగరం రూరల్‌, ఆగస్టు 10:
ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి పైడితల్లమ్మ పండుగకు ముహూర్తం ఖరారు చేశారు. దేవదాయ శాఖ అధికారులు, అర్చకులు, ధర్మకర్తల మండలి సభ్యులు బుధవారం శివాలయం వీధిలోని పైడిమాంబ కల్యాణ మండపంలో సమావేశమై పండుగ తేదీలను ఖరారు చేశారు. అనంతరం కరపత్రాన్ని విడుదల చేశారు. పండగను ఉద్దేశించి ఆలయ పూజారి బంటుపల్లి వెంకటరావు మాట్లాడుతూ సెప్టెంబరు 17న పందిరిరాటతో పండుగ ప్రారంభమౌతుందన్నారు. అదే నెల 21న భక్తులు మండల దీక్ష చేపడ్తారని తెలిపారు. అక్టోబరు 10న తొలేళ్ల ఉత్సవం, 11న సిరిమానోత్సవం జరుగుతుందన్నారు. అక్టోబరు 13న మండల దీక్ష విరమణ,  16న ఉయ్యాల కంబాల ఉత్సవం, అదే నెల 30న కలశ జ్యోతి ఊరేగింపు ఉంటాయన్నారు. నవంబరు 2న చండీహోమం జరుగుతుందన్నారు. కరోనా నేపథ్యంలో గత రెండేళ్లుగా నిబంధనల మధ్య పైడిమాంబ పండుగ జరిగిందని, ఈసారి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి పైడిమాంబ ఆశీస్సులు పొందాలని పిలుపునిచ్చారు. ధర్మకర్తల మండలి సభ్యులు తాడ్డి సురేష్‌, పతివాడ రమణ, సత్తి అచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-11T05:29:27+05:30 IST