యాప్‌లో ఇళ్ల లబ్ధిదారుల ఫొటోలు

ABN , First Publish Date - 2020-05-29T11:25:04+05:30 IST

ర్హులైన పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి సంబంధించి జిల్లాలో ఇంత వరకు పూర్తయిన లే అవుట్లతోపాటు లాటరీ ద్వారా ..

యాప్‌లో ఇళ్ల లబ్ధిదారుల ఫొటోలు

వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ(వెల్ఫేర్‌) తేజ్‌భరత్‌


ఏలూరు సిటీ, మే 28 : అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీకి సంబంధించి జిల్లాలో ఇంత వరకు పూర్తయిన లే అవుట్లతోపాటు లాటరీ ద్వారా కేటాయించిన స్థలాల్లో లబ్ధిదా రులను నిల్చోబెట్టి ఫొటోలు తీసి ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లో నమోదు చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ (వెల్ఫేర్‌) నంబూరి తేజ్‌భరత్‌ అధికారులను ఆదేశించారు. ఇళ్ల పట్టాలు, పనుల ప్రగతిపై గురువారం కలెక్టరేట్‌ నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. జిల్లాలో అర్హులైన లబ్ధిదారులు ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం అందేలా నిష్పక్ష పాతంగా అధికారులు పనిచేయాలన్నారు.


అనర్హులకు స్థలాలు కేటాయించడం, అర్హులకు అన్యాయం జరిగేలా ప్రవర్తించడం వంటి పనులకు పాల్పడవద్దని సూచించారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి జిల్లా పర్యటనకు వచ్చి అడిగినప్పుడు అర్హులు ఎవరూ తమకు ఇంటి స్థలం రాలేదని చెప్పకూడదన్నారు. కాబట్టి స్థలాల పంపిణీ పారదర్శకంగా జరగాలన్నారు. ఒకవేళ ఎవరైనా తనకు ఇంటి స్థలం రాలేదని సీఎం దృష్టికి తీసుకు వెళితే తగిన కారణాలను సమగ్రంగా తెలియజేసేలా వివ రాలను నమోదు చేయాలని, వివరించడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ఇళ్ల స్థలాలు కేటాయించడంలో పారదర్శకంగా పనిచేసి జిల్లాకు మంచి పేరు వచ్చేలా అధికారులు పని చేయాలన్నారు.


ఈ సందర్భంగా జిల్లాలో ఎన్ని లే అవుట్లు పూర్తయ్యాయి, ఎన్ని ప్రగతిలో ఉన్నాయి? పూర్తయిన లే అవుట్లలో ఎన్ని స్థలాలను లబ్ధిదారులకు కేటాయించినదీ వివ రాలను అడిగి తెలుసుకున్నారు. ఏలూరు డివిజన్‌లో మొత్తం 671 లే అవుట్లు పూర్తి కావడంపై జేసీ తేజ్‌భరత్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో డ్వామా పీడీ రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-29T11:25:04+05:30 IST