పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి
ABN , First Publish Date - 2021-10-29T04:56:36+05:30 IST
పెట్రోల్, డీజిల్, గ్యాస్తో పాటు నిత్యావసరాలపై పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని వామపక్షాల ఆధ్వర్యంలో గురువారం బుచ్చిలో నిరసన ర్యాలీ చేపట్టారు.
బుచ్చిలో వామపక్షాల నిరసన ర్యాలీ
బుచ్చిరెడ్డిపాళెం, అక్టోబరు 28: పెట్రోల్, డీజిల్, గ్యాస్తో పాటు నిత్యావసరాలపై పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని వామపక్షాల ఆధ్వర్యంలో గురువారం బుచ్చిలో నిరసన ర్యాలీ చేపట్టారు. పెరిగిన ధరలతో ప్రజలపై పడిన పెనుభారాన్ని అరికట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాలు చేపట్టిన నిరసనకు మద్దతుగా బుచ్చిరెడ్డిపాళెంలో సీపీఎం, ప్రజా సంఘాలు నిరసన ర్యాలీ నిర్వహించినట్టు ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు ముత్యాల గుర్నాథం, మండల కమిటీ సభ్యుడు గండవరపు శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు పట్టణంలోని సీపీఎం పార్టీ కార్యాలయం వద్ద నుంచి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ చేపట్టి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో నాయకులు చల్లకొలుసు మల్లికార్జున. జానీబాషా, శ్రీనివాసులు, మునీర్బాషా, తంబి రమణయ్య, గరికపాటి సురేష్, వెంకట రత్తయ్య, మాధవ్, కృష్ణప్రసాద్, ఆనంద్కుమార్, మాల్యాద్రి, ఖాదర్బాషా తదితరులు పాల్గొన్నారు.
పేదల నడ్డి విరుస్తున్న కేంద్ర ప్రభుత్వం
విడవలూరు: ఇంధన ధరలను పెచ్చి కేంద్ర ప్రభుత్వం పేదల నడ్డి విరుస్తుందని సీపీఎం మండల కన్వీనర్ తుళ్లూరు గోపాల్ తెలిపారు. పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలకు నిరసనగా గురువారం ఆ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. స్థానిక అంకమ్మ దేవాలయం సెంటర్లో శాంతియుతంగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గోపాల్ మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దేశంలో నిత్యావసర ధరలు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. గ్యాస్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, దానికి పోటీగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుంటే సామాన్య ప్రజలు ఎలా బతకాలని ప్రశ్నించారు. పెరిగిన ధరలను తగ్గించకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో సీపీఎం కార్యకర్తలు పాల్గొన్నారు.
దేశాన్ని దివాళా తీయిస్తున్న బీజేపీ
తోటపల్లిగూడూరు : బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల దేశం దివాళా తీస్తుందని సీఐటీయూ మండల కార్యదర్శి వేగూరు వెంకయ్య విమర్శించారు. ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం మండలంలోని నరుకూరు కూడలిలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర ధరల పెరుగుదలకు హద్దు లేకుండా పోతోందన్నారు. దీంతో పేద, మధ్యతరగతి ప్రజల ఇబ్బందులు వర్ణణాతీతం ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రధాని నరేంద్రమోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో మారుబోయిన రాజా, పరుశురాం, కృష్ణ, శివ, తదితరులు పాల్గొన్నారు.