శిక్షల శాతం పెంచాలి

ABN , First Publish Date - 2022-06-26T06:31:16+05:30 IST

మహిళలకు సంబంధించిన కేసుల్లో శిక్షల శాతం పెంచాలని డీజీపీ ఎం. మహేందర్‌రెడ్డి అన్నారు. శనివారం ఎస్పీలు, కమిషనర్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రాష్ట్రస్థాయి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు

శిక్షల శాతం పెంచాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఎస్పీ రాహుల్‌ హెగ్డే

- డీజీపీ ఎం. మహెందర్‌రెడ్డి

సిరిసిల్ల క్రైం, జూన్‌ 25: మహిళలకు సంబంధించిన కేసుల్లో శిక్షల శాతం పెంచాలని డీజీపీ ఎం. మహేందర్‌రెడ్డి అన్నారు. శనివారం  ఎస్పీలు, కమిషనర్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రాష్ట్రస్థాయి నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్‌ కేసులు, మహిళ, ఎస్సీ, ఎస్టీ , గ్రేవ్‌ కేసుల్లో పోలీసు అధికారులు తీసుకున్న ప్రత్యేక చొరవతోనే పురోగతి సాధించారన్నారు. ఎస్సీ, ఎస్టీ, పోక్సో కేసుల్లో సంబంధిత బాధితులకు పరిహారం చెల్లించేవిధంగా అధికారులను సమన్వయ పరుచుకోవాలన్నారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ కేసుల్లో 60రోజుల్లో పరిశోధన పూర్తిచేసి కోర్టులో చార్జీషీట్‌ దాఖలు చేయాలన్నారు. నేర నిరూపణలో సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు.  సాక్ష్యాలను సకాలంలో న్యాయస్థాంలో ప్రవేశపెట్టి నిందితులకు శిక్ష పడేలా చేయాలన్నారు. కమ్యూనిటీ పోలిసింగ్‌, నేను సైతంలో భాగంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును, పోలీస్‌స్టేషన్‌లలో ఏకీకృత సేవలను విస్తరింపచేయడం లక్ష్యంగా ప్రవేశపెట్టిన ఫంక్షనల్‌ వర్టికల్స్‌ అమలు తీరును ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు.  సమావేశంలో ఎస్పీ రాహుల్‌ హెగ్డే, అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీలు చంద్రశేఖర్‌, నాగేంద్రచారి,  సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-26T06:31:16+05:30 IST