క్వింటాకు రూ. 14 వేల నష్టపరిహారం ఇస్తాం
ABN , First Publish Date - 2022-07-04T05:10:10+05:30 IST
మండలంలోని పాల్తూరు గ్రామంలో నకిలీ వేరుశనగ విత్తనంతో నష్టపోయిన రైతులకు క్వింటాకు రూ. 14 వేలు నష్టపరిహారం ఇచ్చేందుకు గుజరాత సీడ్ ఏజెన్సీ వారు అంగీకరించినట్లు రైతులు తెలిపారు.
విడపనకల్లు, జూలై 3 : మండలంలోని పాల్తూరు గ్రామంలో నకిలీ వేరుశనగ విత్తనంతో నష్టపోయిన రైతులకు క్వింటాకు రూ. 14 వేలు నష్టపరిహారం ఇచ్చేందుకు గుజరాత సీడ్ ఏజెన్సీ వారు అంగీకరించినట్లు రైతులు తెలిపారు. గత నెల 22న ముంచిన గుజరాత సీడ్ అని ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన విషయం తెల్సిందే. ఈ కథనంపై స్పందించిన బళ్లారికి చెందిన ఏజెంట్ కరిబసవనగౌడ్ గుజరాత సీడ్ కంపెనీ అధికారులతో కలిసి ఆదివారం పాల్తూరు గ్రామంలోని వేరుశగ పంట పొలాలను పరిశీలించారు. పంటను పరిశీలించి కాయలు లేవని తెలుసుకున్నారు. దీంతో పాల్తూరు రైతులతో చర్చించి విత్తనం కొనుగోలు చేసిన ప్రతి రైతుకు విత్తన ఖరీదును తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అయితే రైతులు మాట్లాడుతూ పెట్టుబడితో పాటు భారీ నష్టాల పాలు అయ్యామని కనీసం ఎకరాకు రూ. లక్ష అయినా ఇవ్వాలని కోరారు. కానీ ఏజెన్సీ నిర్వాహకులు మాత్రం అంత ఇవ్వలేమని క్వింటాకు రూ. 14 వేలు ఇచ్చి ఆదుకుంటామన్నారు. దాదాపుగా 150 క్వింటాళ్లకు నష్టపరిహారం ఇస్తున్నట్లు రైతులు తెలిపారు.