పే అండ్ యూజ్ క్వారంటైన్ గదులకు హోటల్స్ ఓకే!

ABN , First Publish Date - 2020-03-26T22:16:10+05:30 IST

కోవిడ్-19 కేసులు రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు డబ్బు చెల్లించి 14 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండేందుకు ..

పే అండ్ యూజ్ క్వారంటైన్ గదులకు హోటల్స్ ఓకే!

కోల్‌కతా: కోవిడ్-19 కేసులు రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు డబ్బు చెల్లించి 14 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండేందుకు కోల్‌కతాలోని 31 హోటళ్లు సుముఖత వ్యక్తం చేశాయి. హోటళ్లలోని కొన్ని గదులు క్వారంటైన్ యూనిట్ల కోసం ఇవ్వాలంటూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు హోటళ్ల యాజమాన్యాలు ఇందుకు అంగీకరించినట్టు ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు. క్వారంటైన్ కోసం ఉపయోగించే గదుల్లో ఆరోగ్య శాఖ సూచించిన ప్రమాణాలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేస్తామని అన్నారు. ‘‘క్వారంటైన్ కేంద్రాలకు డిమాండ్ పెరగడంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందుకోసం మేము హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఈస్ట్రన్ ఇండియా (హెచ్‌ఆర్ఈఈఐ)ని సంప్రదించాం. క్వారంటైన్ కోసం 31 ఆస్పత్రులను ఎంపిక చేశాం..’’ అని సదరు అధికారి వెల్లడించారు. 


ఆరోగ్యశాఖ వెల్లడించిన ప్రమాణాల ప్రకారం.. క్వారంటైన్‌ రూంలకు కచ్చితంగా అటాచ్డ్ బాత్రూం ఉండాలి. పగటిపూట కిటీకీలు తెరిచి ఉండాలి. ఫ్లోర్ సహా గదుల్లోని ఇతర వస్తువులన్నీ ఎప్పటికప్పుడు బ్లీచ్ సొల్యూషన్‌తో తుడవాలి.  వాడేసిన వస్త్రాలు, దుస్తులు, టవల్స్ వగైరా ఇతరుల దుస్తులతో కలవకుండా జాగ్రత్తపడాలి. వాటిని బ్లీచ్ సొల్యూషన్‌తో ఉతికి ఎండలో ఆరవేయాలి. ఇక ఫర్నీచర్, వాష్‌బేసిన్లు, టాయిలెట్లు అప్పుడే తయారు చేసిన బ్లీచ్ సొల్యూషన్ అంటే ఒక శాతం హైడ్రోక్లోరైడ్ కలిపిన సొల్యూషన్‌తో శుభ్రం చేయాలి. గెస్ట్‌కు సర్వీస్ చేసే హౌస్ కీపింగ్ సిబ్బంది, రూమ్ సర్వీస్ స్టాఫ్ అంతా తప్పకుండా మాస్కులు, గ్లోవ్స్ ధరించాలి. 14 రోజుల క్వారంటైన్ ముగిసినప్పటికీ... గెస్ట్‌లు క్వారంటైన్ నుంచి తిరిగి వెళ్లాలంటే ఆరోగ్య శాఖ అనుమతి తప్పని సరి.

Updated Date - 2020-03-26T22:16:10+05:30 IST