సీఎం కాన్వాయ్ కోసం ప్రజల వాహనాల స్వాధీనమేంటి?: పవన్
ABN , First Publish Date - 2022-04-21T20:38:36+05:30 IST
సీఎం పర్యటన సందర్భంగా కాన్వాయ్ కోసం ప్రజల వాహనాలు స్వాధీనం చేసుకోవడమేంటని...
అమరావతి: ఒంగోలులో సీఎం జగన్ పర్యటన సందర్భంగా కాన్వాయ్ కోసం అధికారులు ప్రజల వాహనాలు స్వాధీనం చేసుకోవడమేంటని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ సీఎం పర్యటనకు ప్రభుత్వ వాహనాలు సమకూర్చలేని పరిస్థితొచ్చిందా? అని నిలదీశారు. ప్రయాణికుల కారును పోలీసులు లాక్కోవడం దుర్మార్గమన్నారు. ఎవరి ఒత్తిడితో ప్రయాణికుల కారును తీసుకున్నారో స్పష్టతివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. లక్షల కోట్ల బడ్జెట్, అప్పులు కలిగిన ఏపీ ప్రభుత్వం.. సొంతంగా వాహనాలు సమకూర్చుకోలేదా? అని ఎద్దేవా చేశారు. సహాయ అధికారిని, హోంగార్డును సస్పెండ్ చేసేసి.. ఘటనను మరుగునపడేద్దామని ప్రభుత్వం భావిస్తున్నట్లుందని మండిపడ్డారు. ఒంగోలు ఘటనపై ప్రజలకు సీఎంవో వివరణ ఇవ్వాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.