పత్తి... బంగారం!
ABN , First Publish Date - 2022-04-16T04:59:06+05:30 IST
జిల్లాలోని మెట్ట ప్రాంతమైన ఆత్మకూరు, ఉదయగిరి, కందుకూరు నియోజకవర్గాల్లో పత్తి సాగు చేపట్టారు.
రికార్డు స్థాయిలో రేటు
ప్రభుత్వ మద్దతు ధర క్వింటం రూ.6025.. బహిరంగ మార్కెట్లో 12వేలు
ఆనందంలో రైతాంగం
తెల్ల బంగారంగా పిలిచే పత్తి రైతులకు సిరులు కురిపిస్తోంది. రికార్డు స్థాయిలో పత్తి ధర పలుకుతోంది. క్వింటం పత్తి మద్దతు ధర రూ.6025 ఉంటే మార్కెట్లో 12 వేలు పలుకుతోంది. దీంతో సాగుదారులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.
సంగం, ఏప్రిల్ 15 : జిల్లాలోని మెట్ట ప్రాంతమైన ఆత్మకూరు, ఉదయగిరి, కందుకూరు నియోజకవర్గాల్లో పత్తి సాగు చేపట్టారు. రెండేళ్తుగా పత్తి సాగు చేసిన రైతులకు దిగుబడితోపాటు ధరలు ఆశాజనకంగా లేకపోవడంతో పెట్టుబడులు కూడా రాలేదు. దీంతో ఈసారి తక్కువ విస్తీర్ణంలోనే పత్తి సాగు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 1500 హెక్టార్లలో సాగు చేసినట్లు అధికారుల అంచనా.
మూడో నెల నుంచే దిగుబడి
విత్తన రకాలను బట్టీ 160 నుంచి 180 రోజుల పంట ఇది. మూడో నెల నుంచి దిగుబడి ప్రారంభమవుతుంది. వాతావరణ పరిస్థితులను బట్టి మూడు నుంచి నాలుగు నెలల వరకు దిగిబడి వస్తుంది. వరిసాగు చేస్తే ధరలు ఉంటాయో లేదోనని అనుమానంతో రబీ సీజన్లో డిసెంబరు, జనవరి నెలల్లో పత్తి సాగు చేపట్టారు. ప్రస్తుతం పత్తి తీత ప్రారంభమైంది.
మద్దతు ధర కంటే రెట్టింపు
జిల్లాలో సాగు తక్కువ కావడంతో దిగుబడి తగ్గుతుంది. దీంతో మార్కెట్లో పత్తికి డిమాండ్ పెరిగింది. పత్తికి ప్రభుత్వ మద్దతు ధర క్వింటం రూ.6025. అయితే మార్కెట్లో మాత్రం సుమారు రూ.12 వేలు పలుకుతోంది. దీంతో పత్తి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
దిగుబడి తగ్గినా మంచి ధరలతో ఆనందం
పత్తి బాగా పండితే ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. మధ్యస్తంగా వచ్చినా 6 నుంచి 8 క్వింటాళ్లు వస్తుంది. ప్రస్తుతం రైతుకు పెరిగిన డీజిల్, మందులు, కూలీల ధరల బట్టి ఎకరాకు రూ.30 వేలు ఖర్చు అవుతుంది. అదే కౌలు రైతుకైతే కౌలుతోపాటు రూ.40 వేలు ఖర్చవుతుంది. ప్రస్తుతం పత్తి ధరలు మద్దతు ధరకు రెట్టింపు ఉండడంతో పెట్టుబడులు పోను ఆదాయం వస్తుంది. ప్రస్తుతం చెట్ల నుంచ పత్తితీత మొదలై, విక్రయాలు జరుగుతున్నాయి. ఈసారి ధర ఆశాజనకంగా ఉండటంతో మున్ముందు సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది.