పర్సంటేజీ పంచాయితీ

ABN , First Publish Date - 2021-01-14T05:51:53+05:30 IST

పర్సంటేజీల పంచాయితీతో పాఠశాలల విద్యార్థులు కోడిగుడ్లకు దూరం కాబోతున్నారు. విద్యాశాఖ అధికారుల ధనాశే ఇందుకు కారణమనే ఆరోపణలున్నాయి.

పర్సంటేజీ పంచాయితీ



కోడిగుడ్ల బిల్లు కావాలంటే సమర్పించాల్సిందే

రెండు మండలాల్లో నిలిచిన చెల్లింపులు

సరఫరా నిలిపివేసేందుకు సిద్ధమవుతున్న కాంట్రాక్టర్‌

అద్దంకి, జనవరి 13: పర్సంటేజీల పంచాయితీతో పాఠశాలల విద్యార్థులు కోడిగుడ్లకు దూరం కాబోతున్నారు. విద్యాశాఖ అధికారుల ధనాశే ఇందుకు కారణమనే ఆరోపణలున్నాయి. వారితీరుతో బిల్లులు రాక కాంట్రాక్టర్‌ కోడిగుడ్ల సరఫరాను నిలిపేసేందుకు సిద్ధమయ్యాడు. వివరాల్లోకి వెళితే.. పాఠశాలలో పిల్లలకు మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ప్రభుత్వం కోడిగుడ్లను సరఫరా చేస్తోంది. అందుకు టెండర్‌ దక్కించుకున్న కాంట్రాక్టర్‌ ఆయా పాఠశాలలకు కోడిగుడ్లను అందజేస్తున్నాడు. ప్రతినెలా పాఠశాలలకు సరఫరా అయిన కోడిగుడ్లకు సంబంధించి ఆయా మండలాల విద్యాశాఖ అధికారులు బిల్లులు పెట్టాల్సి ఉంది. అయితే అద్దంకి, బల్లికురవ మండలాలకు సంబంధించి రెండునెలలుగా బిల్లుల చెల్లింపు జరగలేదు. దీంతో ఆ రెండు మండలాలకు గుడ్ల సరఫరా నిలిపేసేందుకు కాంట్రాక్టర్‌ సిద్ధమయ్యాడు. బిల్లులు చెల్లింపు నిలిపివేత వెనుక అసలు కారణం పరిశీలిస్తే సదరు అధికారికి కాంట్రాక్టర్‌కు మధ్య పర్సంటేజీల వ్యవహారమేనని తెలుస్తోంది. బల్లికురవ ఎంఈవో వీరరాఘవయ్య రెండేళ్లుగా అద్దంకి మండల ఇన్‌చార్జి ఎంఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీంతో రెండు మండలాలకు చెందిన రెండు నెలలు బిల్లులు సుమారు రూ.27.50 లక్షల  చెల్లించాల్సి ఉంది. అద్దంకి మండలంలో రూ.15లక్షలు, బల్లికురవ మండలంలో రూ.12.50లక్షల బకాయి ఉంది. ఈ విషయమై ఎంఈవో వీరరాఘవయ్యను వివరణ కోరగా.. ఆయా పాఠశాలలకు సరఫరా అయిన గుడ్ల వివరాలను హెచ్‌ఎంల ద్వారా తెప్పిస్తున్నట్లు తెలిపారు. మరికొన్ని పాఠశాలల నుంచి వివరాలు రానందున బిల్లుల చెల్లింపులో ఆలస్యం జరిగిందన్నారు. కొన్ని మండలాలకు చిన్నకోడి గుడ్లు సరఫరా జరుగుతున్నట్లు విమర్శలు వస్తున్న క్రమంలో ఆ పాఠశాలల హెచ్‌ఎంల నుంచి సమాచారం తెప్పిస్తున్నామన్నారు. రెండు మూడురోజుల్లో బిల్లులు చెల్లిస్తామని ఎంఈవో తెలిపారు.  

Updated Date - 2021-01-14T05:51:53+05:30 IST