బొప్పాయి అధరహో

ABN , First Publish Date - 2022-07-04T05:30:00+05:30 IST

బొప్పాయి ధరలు రికార్డు స్థాయిలో టన్ను రూ.15 వేలు పలుకుతున్నాయి.

బొప్పాయి అధరహో
రైల్వేకోడూరు ప్రాంతంలో సాగవుతున్న బొప్పాయి పంట

టన్ను రూ.15 వేలు

ముమ్మరంగా కోతలు

నాసిరకం విత్తనాలతో తగ్గిన దిగుబడి 

రైల్వేకోడూరు, జూలై 4: బొప్పాయి ధరలు రికార్డు స్థాయిలో టన్ను రూ.15 వేలు పలుకుతున్నాయి. దీంతో తోటల్లో ముమ్మరంగా కోతలు జరుగుతున్నాయి. అయితే నాసిరకం విత్తనాలతో దిగుబడి తగ్గింది. అయినా ప్రస్తుతం ఉన్న ధరలతో బొప్పాయి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది టన్ను బొప్పాయి కాయలు రూ.5 వేలు మాత్రమే పలికాయి. రైల్వేకోడూరు, ఓబులవారిపల్లె, పుల్లంపేట, చిట్వేలి, పెనగలూరు ప్రాంతాల్లో బొప్పాయి తోటలను రైతులు సాగు చేస్తున్నారు. నియోజకవర్గం మొత్తం మీద రోజూ 50 లారీలలో బొప్పాయి కాయలను మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీ, అహ్మదాబాద్‌, ఆగ్రా, ముంబాయి, తమిళనాడు, కర్ణాటక తదితర నగరాల మార్కెట్‌కు ఎగుమతి చేస్తారు. జాతీయ స్థాయి మార్కెట్‌లో బొప్పాయి కాయలకు మంచి డిమాండ్‌ ఉంది. రైల్వేకోడూరు నియోజకవర్గంలో 15 వేల హెక్టార్లలో రైతులు బొప్పాయి సాగు చేస్తున్నారు. ఎకరాకు 1000 చెట్లు పడతాయి. దున్నకాలు, ఎరువులు, కూలీలు, మొక్కలు తదితరాలు కలిపి సుమారుగా రూ.40 వేలు ఖర్చు వస్తుంది. బాగా దిగుబడులు వస్తే రూ.1.5 లక్షలు ఆదాయం వస్తుంది. చీడపీడలు లేకుండా ఉన్న కాయలకు మార్కెట్‌లో మంచి ధరలు పలుకుతాయి. నియోజకవర్గం మొత్తం మీద 2 వేల మంది కూలీలు జీవనోపాధి పొందుతారు. కాయల కోతలు, కాయకు పేపర్‌ చుట్టడం, లోడింగ్‌ చేయడం వంటి పనులు చేస్తారు. ఇప్పటికే బొప్పాయి కాయలను కొనుగోలు చేయడం కోసం ఢిల్లీ తదితర ప్రాంతాల నుంచి మార్వాడీలు ఇక్కడ మకాం వేసి ఉన్నారు. ఇక్కడ ఉన్న వ్యాపారులతో కలసి తోటలను తీసుకుంటున్నారు. మంచి సైజు కాయలు ప్రస్తుతం కోతలు చేస్తున్నారు. బొప్పాయి ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


ధరలు ఆశాజనకంగా ఉన్నాయి

- ముద్దలూరు సుబ్బరామరాజు, బొప్పాయి రైతు, రైల్వేకోడూరు

బొప్పాయి ధరలు రైతులకు ప్రస్తుతం ఆశాజనకంగా ఉన్నాయి. రైతులు ఎక్కువగా బొప్పాయి సాగుపై ఆధారపడి ఉన్నారు. దిగుబడి వస్తే ప్రస్తుతం ఉన్న ధర రైతుకు మేలు కలుగుతుంది. కష్టపడిన రైతులకు లాభాలు వస్తాయి. దీంతో చేసిన అప్పులు తీరిపోతాయి.



Updated Date - 2022-07-04T05:30:00+05:30 IST