టెండర్ల ప్రక్రియలో చిరుద్యోగి మాయాజాలం

ABN , First Publish Date - 2021-08-05T04:47:41+05:30 IST

సంక్షేమ శాఖలకు సంబంధించి జరుగుతున్న టెండర్లలో పంచాయతీరాజ్‌ శాఖకు చెందిన ఓ చిరుద్యోగి చిలక్కొట్టుడు కొడుతున్నట్లు గుత్తేదారులు ఆరోపిస్తోన్నారు.

టెండర్ల ప్రక్రియలో చిరుద్యోగి మాయాజాలం

అనుకూలురుకు కాంట్రాక్టులు దక్కేలా స్కెచ్‌

ఉన్నతాధికారులకు టెండర్‌దారుల సమాఖ్య ఫిర్యాదు 

గుంటూరు, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): సంక్షేమ శాఖలకు సంబంధించి జరుగుతున్న టెండర్లలో పంచాయతీరాజ్‌ శాఖకు చెందిన ఓ చిరుద్యోగి చిలక్కొట్టుడు కొడుతున్నట్లు గుత్తేదారులు ఆరోపిస్తోన్నారు. అతనే అధికారి వలే బిల్డప్‌ ఇస్తూ తొలుత చర్చల పేరుతో పిలిచి ఆయా టెండర్లకు రేట్‌లు వేయించి ఆ తర్వాత తన అనుకూలురైన వారికి కొమ్ము కాస్తూ వారికి టెండర్లు దక్కేలా చేయడంలో సిద్ధహస్తుడైపోయాడు. ఈ క్రమంలో భారీ మొత్తంలోనే వెనకేసుకొంటున్నట్లు టెండర్‌దారుల సమాఖ్య ఆరోపిస్తోంది. తక్షణమే అతనిపై చర్యలు తీసుకోవాలని జిల్లా, రాష్ట్ర ఉన్నతాధికారులకు ఫిర్యాదులను ఫ్యాక్స్‌ చేసింది. వేరే శాఖ నుంచి డిప్యూటేషన్‌పై వచ్చి కీలకమైన రెవెన్యూ శాఖలో పెత్తనం చెలాయిస్తుండటం చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇటీవట తాడికొండలోని ఏపీ రెసిడెన్సియల్‌ స్కూల్‌లో టెండర్లకు సంబంధించి గుత్తేదారులను చర్చలకు ఆహ్వానించారు. అయితే ఆ రోజున ఎలాంటి సంప్రదింపులు జరపకుండా కేవలం సరైన ధరలు వేయండి అని చెప్పి అన్ని పనులకు రేట్లు వేయించి తీసుకొని వెళ్లారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అతని నుంచి రాలేదు. అయితే ఇతను జిల్లాలో ఒక అధికార పార్టీ నాయకుడి అనుచరులకు అండగా ఉంటూ వారికే టెండర్లు వచ్చేలా చేస్తున్నట్లు టెండర్ల సమాఖ్య ఆరోపిస్తోంది. ఉన్నతాధికారులకు మాత్రం టెండర్లంతా పారదర్శకంగా జరిగినట్లు నివేదించి ఓకే చేయిస్తున్నట్లు పలువురు కాంట్రాక్టర్లు చెబుతున్నారు. దీని వలన సాదారణ కాంట్రాక్టర్లకు అన్యాయం జరుగుతోందని వారు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తక్షణమే ఆ పదవి నుంచి చిరుద్యోగిని తొలగించి నిజాయితీగా వ్యవహరించే వారిని నియమించాలని కోరుతున్నారు. అలానే ఏపీ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌, కళాశాలలకు ఖరారు చేసిన టెండర్లను రద్దు చేసి తిరిగి నిర్వహించాలని వారు కోరుతున్నారు. ఈ మేరకు టెండర్ల సమాఖ్య నాయకులు జిల్లా ఉన్నతాధికారులకు, సీఎంవోకు తమ ఫిర్యాదులను ఫ్యాక్స్‌ చేశారు. ఈ లేఖ బుధవారం వెలుగులోకి వచ్చింది. 

 

Updated Date - 2021-08-05T04:47:41+05:30 IST