వేతనాల కోసం రోడ్డెక్కిన పారిశుధ్య కార్మికులు

ABN , First Publish Date - 2022-06-23T03:59:33+05:30 IST

ఉదయగిరి మేజర్‌ పంచాయతీ కార్మికులు వేతనాల కోసం రోడ్డెక్కారు. సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం తహసీల్దారు కార్యాలయం ఎదుట, అనంతరం ప్రధాన రహదారిపై బైఠాయించారు.

వేతనాల కోసం రోడ్డెక్కిన పారిశుధ్య కార్మికులు
ఆందోళనకారులను లాక్కెళుతున్న పోలీసులు

సీఐటీయూ ఆధ్వర్యంలో రహదారిపై బైఠాయింపు

ఉదయగిరి రూరల్‌, జూన్‌ 21: ఉదయగిరి మేజర్‌ పంచాయతీ కార్మికులు వేతనాల కోసం రోడ్డెక్కారు. సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం తహసీల్దారు కార్యాలయం ఎదుట,    అనంతరం ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఎనిమిది నెలలుగా వేతనాలు చెల్లించలేదని ఇన్‌చార్జి తహసీల్దారు ఫజిహ దృష్టికి తీసుకెళ్లారు. సీఐటీయూ నేత కాకు వెంకటయ్య మాట్లాడుతూ నెలల తరబడి వేతనాలు చెల్లించకపోవడంతో కార్మికుల కుటుంబ పోషణ భారమైందన్నారు. ఏడు రోజులుగా కార్మికులు విధులు బహిష్కరించడంతో పట్టణం డంపింగ్‌యార్డులా మారిందని, మురుగు రోడ్లపై ప్రవహిస్తుండడం, ఎక్కడ చెత్త అక్కడే ఉండడంతో దుర్వాసనతో ప్రజలు సైతం రోడ్డెక్కె పరిస్థితి ఉందన్నారు. అయినా అధికారులు, పాలకులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమన్నారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. విషయం తెలుసుకొన్న ఎస్‌ఐ లతీపున్నీసా సిబ్బందితో అక్కడికి చేరుకొని ఆందోళనకారులతో చర్చించినా ఫలితం లేకపోవడంతో పోలీసులు కార్మికులను పక్కకు లాగి తహసీల్దారు వద్దకు తీసుకెళ్లారు. ఈవో శ్రీనివాసరావు, ఉప సర్పంచ్‌ షేక్‌ ముర్తుజాహుస్సేన్‌ పిలిపించి ఆందోళనకారులతో తహసీల్దారు చర్చలు జరిపారు. గురువారం మూడు నెలల వేతనాలు చెల్లిస్తామని, మిగిలిన వేతనాలు ఒక నెలలో ఇస్తామని, విధులకు హాజరు కావాలని సూచించారు. వేతనాలు చెల్లించేంత వరకు తాము విధులకు హాజరు కామని, ఇలాంటి హామీలు చాలా చూశామని కార్మికులు తెగేసి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కాకు విజయమ్మ, సీఐటీయూ, సీపీఎం నాయకులు ఫరుద్దీన్‌బాషా, గడ్డం నాగేశ్వరరావు, నజీముద్దీన్‌, నాయబ్‌, కామాక్షమ్మ, జనసేన నాయకులు, పారిశుధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-23T03:59:33+05:30 IST