పాకిస్థాన్లో భారత దౌత్యవేత్త కారును ఛేజ్ చేసిన ఐఎస్ఐ.. వీడియో వైరల్
ABN , First Publish Date - 2020-06-05T02:54:54+05:30 IST
పాకిస్థాన్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)కి చెందిన వ్యక్తి ఒకరు ఇస్లామాబాద్లో
ఇస్లామాబాద్: పాకిస్థాన్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ)కి చెందిన వ్యక్తి ఒకరు ఇస్లామాబాద్లో భారత సీనియర్ దౌత్యవేత్త గౌరవ్ అహ్లూవాలియా కారును వెంబడించడం కలకలం రేపుతోంది. ఇందుకు సంబంధించిన వీడియోను ‘ఏఎన్ఐ’ పోస్టు చేసింది. వైరల్ అయిన ఈ వీడియోలో మోటార్ సైకిల్పై ఓ వ్యక్తి గౌరవ్ అహ్లూవాలియా కారును వెంబడించడం స్పష్టంగా కనిపిస్తోంది. పాకిస్థాన్ హైకమిషన్కు చెందిన ఇద్దరు అధికారులు గూఢచర్యం చేస్తున్నట్టు ఆరోపించిన భారత్ వారిని దేశం నుంచి వెళ్లాలని ఆదేశించింది. అప్పటి నుంచి పాకిస్థాన్ ప్రతీకార్య చర్యల కోసం ఎదురుచూస్తోంది.
తమ దౌత్యవేత్తలపై భారత్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని పేర్కొన్న పాకిస్థాన్.. జూన్ 1న నిరసన తెలిపినందుకు గాను గౌరవ్ అహ్లూవాలియాకు సమన్లు జారీ చేసింది. కాగా, ప్రతీకార చర్యగా పాకిస్థాన్లోని భారత హైకమిషన్ నుంచి భారత అధికారులను బహిష్కరించే అవకాశం ఉందని మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది. కాగా, ఉగ్రవాదులతో సంబంధాలు కలిగిన ఐఎస్ఐని భారత ఉన్నతస్థాయి అధికారులను వేధించడానికి వాడుకోవడం ఆందోళన కలిగిస్తోంది.