ఎయిరిండియాకు పాకిస్థాన్ ప్రశంశ
ABN , First Publish Date - 2020-04-05T03:17:44+05:30 IST
‘ప్రపంచం అట్టుడికిపోతున్న ఇలాంటి తరుణంలో మీరు పక్కదేశాల కోసం విమానాలు నడుపుతున్నారు.. మీ పనితీరును అభినందిస్తున్నాం. మిమ్మల్ని చేస్తే ఎంతో గర్వంగా...
న్యూఢిల్లీ: ‘ప్రపంచం అట్టుడికిపోతున్న ఇలాంటి తరుణంలో మీరు పక్కదేశాల కోసం ప్రత్యేకంగా విమానాలు నడుపుతున్నారు.. మీ పనితీరును అభినందిస్తున్నాం. మిమ్మల్ని చూస్తే ఎంతో గర్వంగా ఉంది. గుడ్ లక్’ ఈ మాటలు అన్నది అక్షరాలా పాకిస్తాన్ ఎయిక్ ట్రాఫిక్ కంట్రోలర్. అది కూడా ఎయిరిండియాను ప్రశంశిస్తూ అన్న మాటలివి. వివరాల్లోకి వెళితే.. కరోనా లాక్డౌన్ కారణంగా భారత్లో చిక్కుకుపోయిన యూరోపియన్లను వారి దేశాలకు చేర్చేందుకు.. అలాగే కరోనాను ఎదుర్కొనేందుకు అవసరమయ్యే పరికరాలను వారికి అందించేందుకు ఎయిరిండియా ద్వారా మన ప్రభుత్వం ప్రత్యేక విమానాలను నడుపుతోంది. ఇందులో భాగంగా జర్మనీలోని ఫ్రాంక్ఫర్డ్కు బయలుదేరిన ఎయిరిండియా విమానాలకు తమ దేశం గుండా దారి వెళ్లనిచ్చే క్రమంలో పైలట్ల కాంటాక్ట్లోకి పీటీసీ వచ్చింది. వెళ్లాల్సిన దారి చెప్పింది. పైలట్లు ధన్యవాదాలు చెప్పి అటుగా బయలుదేరారు. ఆ సమయంలో పీటీసీ ఊహించని విధంగా భారత చర్యలను, ఎయిరిండియా నిబద్ధతను ప్రశంశించింది.
ఆ సమయంలో విమానం నడిపిన పైలట్ ఒకరు దీనిపై స్పందిస్తూ..‘ఆ క్ణణం నాకు ఎంతో గర్వంగా అనిపించింది. నాతోపాటు ఎయిరిండియా సిబ్బంది అందరూ గర్వపడాల్సిన విషయం అది’ అని అన్నారు. పాకిస్తాన్ను దాటాక తాము ఇరాన్ ఎయిర్ కంట్రోలర్ కనెక్టివిటీలోకి వెళ్లామని, అయితే అక్కడ కూడా ఊహించని ఓ సంఘటన జరిగిందని, ఇరాన్ 1000 మైళ్ల డైరెక్ట్ రూట్ను తమకు కల్పించిందని, అయితే తన పైలట్ కెరీర్లో ఎన్నడూ ఇలా జరగలేదని ఆయన చెపుకొచ్చారు. ఇరాన్ ఎప్పుడూ, ఏ విమానానికీ డైరెక్ట్ రూట్ ఇవ్వదని, అది కేవలం వారి రక్షణ విమానాలకు మాత్రమే రిజర్వ్ అయి ఉంటుందని, కానీ తమకు డైరెక్ట్ రూట్ ఇవ్వడమే కాకుండా అభినందనలు కూడా తెలిపడం చాలా ఆనందం కలిగించిందని ఆయనన్నారు. తరువాత టర్కీ ఏటీసీని కాంటాక్ట్ అయి చివరగా జర్మనీ చేరామని వివరించారు.
జర్మనీలోని ఫ్రాంక్ఫర్డ్ వెళ్లేవరకు ప్రతి ఏటీసీ తమను అభినందిస్తూ ముందుకు సాగనంపిందని, అది తమకు ఎంతో గర్వంగా అనిపించిందని ఆ పైలట్ ఆనందం వ్యక్తం చేశారు.