చంద్రబాబు సీఎం కావాలంటూ పాదయాత్ర
ABN , First Publish Date - 2022-01-17T06:50:56+05:30 IST
చంద్రబాబు సీఎం కావాలని కోరుతూ మదనపల్లెకు చెందిన తండ్రీకొడుకులు ముక్కంటి ఆలయానికి పాదయాత్రగా వచ్చారు.
శ్రీకాళహస్తి, జనవరి 16: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని కోరుతూ మదనపల్లెకు చెందిన తండ్రీకొడుకులు ముక్కంటి ఆలయానికి పాదయాత్రగా వచ్చారు. వివరాలివీ.. గతంలో సీఎంగా ఉన్న చంద్రబాబు తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు వచ్చి, అలిపిరి వద్ద జరిగిన బాంబుపేలుళ్ల ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుంచి మదనపల్లెకు చెందిన టీడీపీ వీరాభిమాని అయిన నాగరాజు పార్టీ అధినేత చంద్రబాబు క్షేమంగా ఉండాలని కోరుతూ తిరుమలకు పాదయాత్రగా వస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన 114 సార్లు కాలినడకన వచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం నాగరాజు కుమారుడు మంజునాథతో కలసి మదనపల్లె నుంచి శ్రీకాళహస్తికి పాదయాత్రగా వచ్చి వాయులింగేశ్వరుడిని దర్శించుకున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందనీ, చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, తండ్రీకొడుకులను టీడీపీ నాయకులు విజయకుమార్ నాయుడు, మిన్నల రవి, ప్రతాప్, ఆర్ముగం, మురళి, ఖాదర్బాషా, మణి తదితరులు సన్మానించారు.