కరోనాతో మృతి.. 15 నెలల తర్వాత ఆ డాక్టర్ మృతదేహాన్ని సమాధిలోంచి ఎందుకు బయటకు తీశారంటే..

ABN , First Publish Date - 2021-07-27T17:28:55+05:30 IST

డాక్టర్‌ హెర్క్యులస్‌ సైమన్‌.. ప్రముఖ న్యూరో సర్జన్‌గా, న్యూ హోప్ హాస్పిటల్ ఎండీగా చెన్నైలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు

కరోనాతో మృతి.. 15 నెలల తర్వాత ఆ డాక్టర్ మృతదేహాన్ని సమాధిలోంచి ఎందుకు బయటకు తీశారంటే..

డాక్టర్‌ హెర్క్యులస్‌ సైమన్‌.. ప్రముఖ న్యూరో సర్జన్‌గా, న్యూ హోప్ హాస్పిటల్ ఎండీగా చెన్నైలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. కరోనా వైరస్‌ మొదటిదశ సమయంలో వైరస్‌ బాధితులకు సైమన్ అండగా నిలిచారు. చివరకు ఆయన కూడా ఆ వైరస్ బారిన పడి ఏప్రిల్‌ 20న మరణించారు. క్రైస్తవ మతాచారం ప్రకారం ఆయన మృతదేహాన్ని కీల్పాక్‌ గార్డెన్‌ సిమెట్రీలో ఖననం చేసేందుకు తీసుకెళ్లగా స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. వైరస్ వ్యాప్తి చెందుతుందనే భయంతో ఆయన మృతదేహాన్ని అక్కడ ఖననం చేయనివ్వలేదు. దీంతో కార్పొరేషన్‌ వలంటీర్లు సైమన్‌ మృతదేహాన్ని వేలంగాడు శ్మశానవాటికలో ఖననం చేశారు.


తన భర్తకు మరణానంతరం క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం గౌరవ వీడ్కోలు పలకలేదనే కారణంతో సైమన్ భార్య ఆనంది కోర్టుకెక్కారు. సైమన మృతదేహాన్ని తమ మతాచారం ప్రకారం కీల్పాక్‌ గార్డెన్‌ సిమెట్రీలో ఖననం చేసేందుకు అనుమతించాలని కోరుతూ ఆమె మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఆ అప్పీలుపై విచారణ ప్రారంభించిన న్యాయమూర్తులు సానుకూలంగా స్పందించారు. డాక్టర్‌ సైమన్‌ మృతదేహాన్ని ఆయన సతీమణి ఆనంది కోరినట్టు కీల్పాక్ గార్డెన్ సిమెట్రీలో ఖననం చేసేందుకు కార్పొరేషన్‌ అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీంతో వేలంగాడు శ్మశాన వాటిక నుంచి సైమన్ మృతదేహాన్ని తవ్వి తీసి కీల్పాక్ గార్డెన్ సిమిట్రీకి తరలించి గత ఆదివారం ఖననం చేశారు. 

Updated Date - 2021-07-27T17:28:55+05:30 IST